శుక్రవారం బ్యాంకు ఉద్యోగుల సమ్మె
దేశంలోని బ్యాంకు ఉద్యోగుల సంఘాలన్నీ జులై 29న శుక్రవారం సమ్మెకు దిగనున్నాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) ప్రభుత్వ అధికారులతో చేపట్టిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో గతంలో సమ్మె దిశగా తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. 9 యూనియన్లతో కూడిన అన్ని బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొంటారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్(ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం కూడా జులై 29న సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు.
దీంతో దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని దాదాపు పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన 80వేల బ్యాంకు శాఖల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొననున్నారు. ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో ప్రవేశపెడుతున్న కొన్ని పాలసీలను, సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు
అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం సమ్మె నోటీసులను ఇచ్చిన దానిలో డిమాండ్లు :
- బ్యాంకులను ప్రైవేటీకరించవద్దు
- ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రైవేటు మూలధనాన్ని పెంచొద్దు
- బ్యాంకింగ్ రంగంలో ఎఫ్డీఐని ప్రోత్సహించవద్దు
- బ్యాంకులను తెరిచేందుకు కార్పొరేట్లకు లైసెన్సులు వద్దు
- చిన్న బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల కోసం ప్రయివేటు వ్యక్తులకు లైసెన్సులు వద్దు
- ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణ వద్దు
- సహకార బ్యాంకుల వ్యవస్థను బలహీనపరచొద్దు
- బ్యాంకులన్నింటినీ విలీనం చేసి వాటి సంఖ్యను తగ్గించవద్దు
- బ్యాంకుల్లో ప్రాధాన్యత రంగాల రుణాలను బలహీన పరచవద్దు
- వ్యవసాయ రంగానికి మరింతగా రుణాలను అందేలా చూడాలి
- కఠిన చర్యల ద్వారా వసూలు కాని రుణాలను రాబట్టేందుకు ప్రయత్నించాలి
- బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాలి