9500 సర్వేల్లో రూ. 22,475 కోట్ల నల్లధనం వెల్లడి
నల్లధనంపై ప్రభుత్వ విధానాలను పార్లమెంటు సాక్షిగా వెల్లడించారు అరుణ్ జైట్లీ. పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పలు విషయాలను వెల్లడించారు. దీని ప్రకారం గత రెండేళ్లలో ఆదాయపు పన్ను శాఖ చేసిన 9500 సర్వేల్లో రూ. 22475 కోట్ల వెల్లడి అవ్వని ఆదాయాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో భాగంగా ఆ శాఖ గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 990 గ్రూపుల్లో తనిఖీలు నిర్వహించిందని లోక్ సభలో జైట్లీ చెప్పారు.
అంతేకాకుండా ఐటీ శాఖ పరంగా జరుగుతున్న క్రిమినల్ విచారణలు కూడా పెరుగుతున్నాయన్నారు. 2102-13, 3013-14 సమయంలో 1690 క్రిమినల్ కేసులు నమోదవ్వగా 2014-15, 2015-16 సంవత్సరాల్లో వీటి సంఖ్య 3140 కి పెరిగింది. నల్ల ధనాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టిందని జైట్లీ చెప్పారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు, పనామా లీక్స్లో ఉన్న వివరాలకు సంబంధించి మల్టీ ఏజెన్సీ గ్రూప్, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆర్థిక సమాచారాన్ని వివిధ వ్యవస్థల మధ్య పంపిణీ చేసుకోవడం, బినామీ లావాదేవీల(నిషేధ) చట్టం వంటివి వీటిలో ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వం నల్లధనాన్నిఅరికట్టేందుకు ప్రయత్నిస్తోందని జైట్లీ వెల్లడించారు.