ఇన్ఫోసిస్ షేర్లు పడిపోవడానికి కారణాలు ఇవే
ఇన్ఫోసిస్ ఫలితాలు పెట్టుబడిదారులను నిరాశపరిచాయి. గత కొన్ని త్రైమాసికాల్లో విశ్లేషకుల అంచనాలను మించిన ఫలితాలను సాధించిన ఐటీ దిగ్గజం ఈసారి అంచనాలకు అనుగుణంగా పనిచేయలేకపోయింది. ఫలితాల తర్వాత కంపెనీ షేర్లు 9 శాతం పడ్డాయి. దీనికి గల కారణాలేంటో తెలుసుకుందాం.
రెవెన్యూ అంచనా తగ్గింపు:
విశ్లేషకులు ప్రధానంగా దృష్టి సారించే అంశం అయిన రెవెన్యూ అంచనాలు నిట్టూర్చాయి. కంపెనీ రెవెన్యూ అంచనాలను తగ్గించింది. ఏడాది కాలానికి రెవెన్యూ అంచనాలను ఇంతకుముందు ఉన్న 11.5-13.5శాతం నుంచి 10.5-12 శాతానికి తగ్గించారు.
అంచనాలను అందుకోలేకపోయిన డాలరు రెవెన్యూ
డాలరు రూపంలో వచ్చే ఆదాయం 2550 మిలియన్ డాలర్లుగా అంచనా వేయగా, వాస్తవంగా అది 2501 డాలర్లుగా ఉంటూ లక్ష్యాన్ని సాధించలేకపోయింది. దీంతో స్టాక్ మార్కెట్లు ఈ విషయాన్నిజీర్ణించుకోలేక నష్టాల బాట పట్టాయి.
రూపాయి రెవెన్యూ సైతం అదే బాటలో:
దేశీయ కరెన్సీ రూపంలో వచ్చే ఆదాయం సైతం అంచనాలకు తగ్గట్లుగా లేదు. విశ్లేషకులు రూ. 17 వేల కోట్ల అంచనాలతో ఉండగా వాస్తవ రూపీ కరెన్సీ ఆదాయం రూ. 16,782 కోట్లుగా ఉంది. అయితే వాస్తవంగా ఊహించన దాని కంటే ఇది స్వల్పమైన తగ్గుదలే.
సీఈవో స్పందన:
ఇన్ఫోసిస్ సీఈవో ఫలితాలపై ఈ విధంగా స్పందించారు."కన్సల్టింగ్ వ్యయం తగ్గింది. పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు సమయం తీసుకుంటోంది. దీంతో మొదటి త్రైమాసిక వృద్ది అంచనాలను అందుకోలేదు."అని చెప్పారు. ఇది పెట్టుబడిదారులకు రుచించలేదు.
9 శాతం పడిన కంపెనీ షేర్లు
క్రితం రూ. 1070 వద్ద ట్రేడయిన షేర్లు 9 శాతానికి పైగా క్షీణించాయి. ఒక దశలో 10 శాతం వరకూ క్షీణించినా స్వల్పంగా కోలుకున్నాయి.