పీపీఎఫ్లో ఇప్పుడు పెట్టుబడి పెట్టేందుకు 5 కారణాలు
సంఘటిత రంగాల్లోని కార్మికులకు ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) ఉంటుంది. అదే రీతిన అసంఘటిత రంగ కార్మికులకు దీర్ఘకాలంలో ఆర్థిక రక్షణ కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) సదుపాయాన్ని కల్పించారు. ఇందులో సాధారణ ప్రజలు సైతం భాగస్వాములుగా చేరవచ్చు. ప్రజలు ఎక్కువగా దీనిని పన్ను మినహాయింపు సాధనంగానే భావిస్తున్నారు. అయితే వీటిపై వడ్డీని ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. ప్రస్తుతం చాలా పెట్టుబడి సాధనాలపై వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. అయినప్పటికీ పీపీఎఫ్ ఆకర్షణీయంగానే ఉంది. ఈ క్రమంలో పీపీఎఫ్లో పెట్టుబడులు పెట్టేందుకు 5 కారణాలను తెలుసుకుందాం.
బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేట్లు
వివిధ పెట్టుబడి సాధనాలకు సంబంధించి ప్రభుత్వం త్రైమాసికానికొకసారి వడ్డీ రేట్లను సవరిస్తున్నప్పటికీ బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ కంటే పీపీఎఫ్పై ఎక్కువనే వస్తోంది.
బ్యాంకులన్నీ తమ డిపాజిట్లపై దాదాపుగా 7.5 శాతం వడ్డీ అందిస్తోండగా, పీపీఎఫ్పై మీకు 8.1 శాతం వడ్డీ లభిస్తోంది.
పీపీఎఫ్పై వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు
దేశంలో కొన్ని పెట్టుబడి సాధనాలపై వచ్చే ఆదాయం మాత్రమే పన్ను మినహాయింపుకు అర్హత కలదు. పీపీఎఫ్పై సంపాదించే వడ్డీకి పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది.
సెక్షన్ 80సీ ప్రయోజనాలు
పీపీఎఫ్ మరో విధంగా సెక్షన్ 80సీ కింద సైతం మినహాయింపును కల్పిస్తోంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం రూ. 1లక్ష 50 వేల వరకూ పెట్టే పెట్టుబడులకు పన్ను రిబేటు కల్పిస్తారు.
చాలా సురక్షితమైనవి
చాలా పెట్టుబడి సాధనాలతో పోల్చి చూస్తే పీపీఎఫ్ బాగా సురక్షితమైనది. ప్రభుత్వమే పీపీఎఫ్ను నిర్వహిస్తున్నందు వల్ల డీఫాల్ట్ అయ్యేందుకు సున్నా శాతం అవకాశం ఉంటుంది.
పదవీ విరమణ నిధి ఏర్పాటు
పీపీఎఫ్కు లాక్ ఇన్ పీరియడ్ 15 ఏళ్లు ఉంటుంది. 7 ఏళ్ల తర్వాత నుంచి మాత్రమే పాక్షికంగా ఉపసంహరించేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పదవీ విరమణ నిధిని ఏర్పరుచుకునేందుకు ఒక ఉత్తమ సాధనంగా ఇది ఉపకరించగలదు.