జన్ధన్ ఖాతాల్లో పెరుగుతున్న నిల్వలు, తగ్గుతున్న జీరో బ్యాలెన్స్ అకౌంట్స్
దేశ ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలందించేందుకు ప్రధానమంత్రి ప్రతిపాదించిన జన్ధన్ యోజన నెమ్మదిగా ఫలితాలను రాబడుతోంది. జూన్ 29 నాటికి మొత్తం ఖాతాల్లోని నిల్వలు రూ. 39251.57 కోట్లకు చేరాయి. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా రూ. 30,991 కోట్లు ఉండగా, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వాటా రూ. 6788 కోట్లుగాను, ప్రయివేటు బ్యాంకుల్లో అతి తక్కువగా రూ. 1472.51 కోట్లుగాను ఉన్నాయి. జీరో బ్యాలెన్స్ అకౌంట్లకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 25.61 శాతం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 21.35 శాతం, ప్రయివేటు బ్యాంకుల్లో 37.33 శాతంగా ఉన్నాయి. మొత్తం మీద బ్యాంకింగ్ రంగంలో చూస్తే ఈ పథకం కింద ఉన్న జీరో బ్యాలెన్స్ ఖాతాలు 25.29 శాతంగా ఉన్నాయి.
ఈ పథకం రెండు దశల్లో అమలు చేయబడుతోంది. మొదటి దశలో ఆగస్టు 15,2104 నుంచి ఆగస్టు 14,2015 మధ్య దేశంలో బ్యాంకింగ్ రంగానికి దూరంగా ఉన్న వారి చేత ఖాతాలను తెరిపించారు. రెండో దశలో 15 ఆగస్టు 2015 నుంచి 14 ఆగస్టు, 2018 మధ్య అందరికీ సూక్ష్మ బీమాను అందించడం. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలను ప్రారంభించారు. ఈ మూడింటిలో అటల్ పెన్షన్ యోజనకు స్పందన తక్కువగా వస్తోంది.