అంధులపై వ్యాఖ్యలు: క్షమాపణ చెప్పిన గవర్నర్
ముంబై: 'గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను ఉన్నోడే రాజు' అన్న తన వ్యాఖ్యలు అంధుల మనసును గాయపరిచి వుంటే, అందుకు తాను చింతిస్తున్నానని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు.
తన వ్యాఖ్యలపై బుధవారం ఆయన వివరణ ఇచ్చారు. ప్రపంచంలోనే మిగతా దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన పనితీరుతో ముందుకు సాగుతుందని చెప్పడానికే తాను ఆ సామెతను వాడినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే రాజన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడ్డారు.
అయితే భారత్లో అద్భుత రీతిన వృద్ధి లేదని, ఇదే సమయంలో చాలా దేశాలకన్నా దూసుకెళుతోందని చెప్పడమే తన ఉద్దేశమని తెలిపారు. తాను వాడిన సామెతలోని అసలు అర్ధాన్ని చూడకుండా, పెడర్ధాన్ని తీసేందుకే మీడియా యత్నించిందని ఆయన ఆరోపించారు. తన వ్యాఖ్య ఎవరిని బాధించినా, తనను క్షమించాలని అన్నారు.
పుణెలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ 12వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ మంచి పనితీరు కనబరుస్తూండటాన్ని గుడ్డివాళ్ల రాజ్యంలో ఒక కన్ను ఉన్నవాడే రాజు అని పోల్చారు.
ప్రపంచ దేశాలు మందగించిన వృద్ధితో ఇబ్బందులు ఎదుర్కొంటూంటే, భారత్ మెరుగైన వృద్ధి సాధిస్తూ ముందుకు దూసుకెళ్తొందన్న విషయాన్ని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక చాలు అని సరిపెట్టుకునే స్థాయికి ఇంకా మేం చేరుకోలేదని, అయితే ఒకటి మాత్రం చెప్పగలను, అందరూ గుడ్డివాళ్లే ఉన్న రాజ్యంలో ఒక కన్ను ఉన్నవాడే రాజని మాత్రం ఘంటాపథంగా చెప్పగలనని పేర్కొన్నారు.
భారత్లో గత కొద్దికాలంలో కొన్ని సానుకూల కార్యక్రమాలు జరిగాయన్నారు. అయితే మరిన్ని జరగాల్సి ఉందని చెప్పారు. కరెంట్ అకౌంట్ లోటు, విత్తలోటు విషయంలో భారత్ సాధించిన విజయాలు, ద్రవ్యోల్భణాన్ని 11 శాతం నుంచి 5 శాతానికి లాక్కురావడం.. ఇవి చెప్పుకోదగిన విజయాలు అన్నారు. వడ్డీరేట్లపై తగ్గింపుకు అవకాశం ఏర్పడిందన్నారు.
కొత్త దివాలా చట్టంతో పాటు జీఎస్టీలను అమల్లో తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చైనాతో పోలిస్తే సంస్కరణల అమల్లో దశాబ్దం వెనకబడ్డామనిస ఈ తేడా రెండు ఆర్థిక వ్యవస్థల పరిణామంలో తెలుస్తుందన్నారు.