స్టాక్ మార్కెట్ భారీ పతనం: ఇన్వెస్టర్లకు మరింత బాధ
గురువారం నాటి సెషన్లో స్టాక్ మార్కెట్లు 800 పాయింట్లకు పైగా పతనమై ఇన్వెస్టర్లకు చెందిన సుమారు రూ. 3 లక్షల కోట్ల రూపాయలను హరించగా, శుక్రవారం కూడా అదే పతనం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ ఆరంభంలో కాస్త ఫర్వాలేదనిపించినా 11.30 గంటల ప్రాంతంలో స్టాక్ మార్కెట్లు పూర్తిగా నష్టాల్లోకి వెళ్లాయి.
అన్ని రంగాల్లోని ఈక్విటీలకు అమ్మకాల ఒత్తడి ఎదురుకావడంతో మధ్యాహ్నం 12:35 నిమిషాల సమయానికి సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా దిగజారింది. మరో రూ. 1.25 లక్షల కోట్లు హారతి కర్పూరమయ్యాయి. గత శుక్రవారంతో పోలిస్తే నిప్టీ సూచిక 24 శాతానికి పైగా పడిపోయి ఇన్వెస్టర్లకు మరింత బాధను మిగిల్చింది.
దీంతో ఈ సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లోకి రావద్దని మార్కెట్ నిపుణులు సలహా. ఈ పతనం మరింత దారుణంగా ఉండవచ్చని భావించిన ట్రేడర్లు, ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అతర్జాతీయ స్థాయిలో స్టాక్ మార్కెట్లు స్థిరపడే వరకూ కొత్తగా ఈక్విటీలు కొనుగోలు చేస్తే నష్టమే తప్ప లాభం ఉండదని ఐడీబీఐ కాపిటల్ రీసెర్చ్ విభాగం హెడ్ ఏకే ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ప్రస్తుతం 15 వేల స్థాయిలో ఉన్న అమెరికాలో డోజోన్ సూచిక ఇండస్ట్రియల్ యావరేజ్ 25 నుంచి 30 శాతం వరకూ పడిపోవచ్చని, ప్రపంచ మార్కెట్లు అదే దారిలో నడవక తప్పదని ఆయన అన్నారు. ఇదే విధమైన అభిప్రాయాన్ని కేఆర్ చౌక్సీ షేర్స్ చీఫ్ దేవన్ చోక్సీ కూడా వెల్లడించారు.
అయితే మధ్యాహ్నాం మూడు గంటల ప్రాంతంలో కొనుగోళ్లపై పాజిటివ్ సంకేతాలు అందడంతో సెన్సెక్స్ కాస్తంత కోలుకుంది. ప్రస్తుతం 99 పాయింట్లకు చేరిన సెన్సెక్స్ 23,051 వద్ద ట్రేడ్ అవుతుంది. అదే విధంగా నిప్టీ విషయానికి వస్తే ఒక పాయింట్ పెరిగి 6,977 వద్ద ట్రేడ్ అవుతుంది.
దీంతో ఇన్వెస్టర్లు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరికొన్ని వారాలు స్టాక్ మార్కెట్లు ఇదే పరిస్థితిలో ఉండొచ్చని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. జీడీపీతో పోలిస్తే మార్కెట్ కాప్ 2008లో 0.55:1కి తగ్గిపోయిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుతం 0.59:1గా ఉన్న మార్కెట్ కాప్ మరింతగా నష్టపోవచ్చని దేవన్ అభిప్రాయపడ్డారు.