మార్పుల్లేవ్: కీలక వడ్డీరేట్లు యధాతథం
ముంబై: ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. మంగళవారం సమీక్ష వివరాలను ఆర్బీఐ గవర్నర్ రఘరామ్ రాజన్ వెల్లడించారు. కీలక వడ్డీరేట్లు, రెపోరేటు 6.75శాతం, రివర్స్ రెపోరేటు, నగదు నిల్వల నిష్పత్తి 4శాతం యథాతథంగా ఉంటాయని ఆయన ప్రకటించారు.
ద్రవ్యోల్బణంపై ఏడో వేతన సంఘం ప్రభావాన్ని పరిశీలిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. బేస్రేటు లెక్కింపు కొత్త విధానంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశీయ ఉత్పత్తి రంగం ఉరకలెత్తుతున్న నేపథ్యంలో గడచిన త్రైమాసికంలో జీడీపీ అంచనాలను మించి 7.4 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు కూడా అవసరం లేదన్న భావన వ్యక్తమైందన్నారు. గడిచిన రెండు నెలలుగా ద్రవ్యోల్బణం ఎగువముఖం పట్టడం, అగ్రరాజ్యం అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచేందుకు సమాయత్తమవుతున్న ఈ తరుణంలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇంట్రస్ట్రేట్లను యథాతథ స్థితిలోనే కొనసాగించవచ్చునని అత్యధికమంది అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో ఆర్బీఐ రాజన్ వడ్డీరేట్లపై వేచి చూసే ధోరణి అవలంభించవచ్చునని యూకో బ్యాంక్ ఎండీ, సీఈవో ఆర్కే ఠక్కర్ తెలిపారు. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, పప్పు దినుసుల ధరలు భగ్గుమండుతుండటం, టమాటా ధరలు అధికమవడంతో ఈ నెలలో ద్రవ్యోల్బణ గణాంకాలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్న అంచనాతో రాజన్ రేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లాయని ఆయన పేర్కొన్నారు.