మహేష్ చేతికి మరో బ్రాండ్ 'ఇంటెక్స్' (ఫోటోలు)
హైదరాబాద్: భారత్లో 10.5 శాతం వాటా కలిగిన, స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తున్న ఇంటెక్స్ సంస్థ, తన ఉత్పత్తుల ప్రచారం నిమిత్తం బ్రాండ్ అంబాసిడర్గా సూపర్స్టార్ మహేష్ బాబును ఎంచుకుంది. సోమవారం మద్యాహ్నాం హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇంటెక్స్ ప్రతినిధులు మహేష్ బాబుతో కుదుర్చుకున్న ఈ ఒప్పంద వివరాలను వెల్లడించారు.
'వినియోగదారులు కోరుకునే పటిష్టమైన ఉనికి, స్టయిల్, విలువ లాంటి వాటన్నింటినీ కలిగి ఉండే ఇంటెక్స్ వంటి బ్రాండ్తో అనుబంధం ఎంతో ఆనందదాయకం. భారతదేశ ప్రజానీకం నిరంతరంగా మార్పు చెందుతూ వస్తోంది. తాము కోరుకునే అంశాల్లో సహజ విలువను ప్రశంసించడం అధికమైపోతోంది. ఇటీవలి కాలంలో చక్కటి పనితీరును ప్రదర్శించిన ఇంటెక్స్ సాధారణ ప్రజానీకంతో పటిష్ట అనుబంధాన్ని కలిగి ఉందని నేను విశ్వసిస్తున్నాను. ఏపీలో ప్రజలతో ఇంటెక్స్ అనుబంధాన్ని మరింత పటిష్టం చేయడం నాకెంతో ఆనందం' అని సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్నారు.
తెలుగు ప్రజలతో ఇంటెక్స్ అనుబంధం గురించి డైరెక్టర్ కేశవ్ బన్సాల్ మాట్లాడుతూ 'తాము చేసే పనిలో ఉత్కృష్టత కనబరిచే అత్యుత్తమ నటుల్లో మహేష్ ఒకరు. కచ్చితమైన ఆటిట్యూడ్తో వారు ఆయా పనులు చేస్తుంటారు. ఆయనొక సూపర్ స్టార్. ఏపీలో ఆయనకు ఇంతగా అభిమానులు ఉన్నారంటే అందుకు కారణం ఆయన కఠోర శ్రమ మరియు ప్రేక్షకులను ఆనందింపజేయడంలో ఆయనకు గల అంకితభావం. రాష్ట్రానికి చెందిన ప్రేక్షకులతో మరీ ముఖ్యంగా యువతతో ఆయన అనుబంధం ఏపీలో ఇంటెక్స్ బ్రాండ్ స్ధానాన్ని మరింత ఉన్నత స్ధాయికి చేర్చగలదు' అని అన్నారు.