పన్ను పరిధి: ఏపీ, టీలో కలిపి 7.93 లక్షల మంది
పన్ను పరిధిలోకి మరింత మందిని తీసుకొచ్చేందుకు గాను ఇన్కమ్ ట్యాక్స్ శాఖ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖను ఆదేశించింది.
పన్ను చెల్లింపుదారులపై అదనపు భారం వేయకుండా ప్రభుత్వ ఆదాయం పెరగాలంటే పన్ను వసూళ్ల పరిధిని వీలైనంతగా పెంచుకోవడమే మార్గమని కేంద్రం భావిస్తున్నది. పన్నుల పరిధిని విస్తృతం చేయాలన, లక్ష్యాన్ని ఈ ఏడాదే సాకారం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి ఆదేశాలు జారీ చేయడంతో ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది ఐటీ శాఖ.
సీబీడీటీ ప్రాంతాల వారీగా ఎంతమంది కొత్త పన్ను చెల్లింపుదారులను చేర్చాలనే లక్ష్యాలను కూడా ఐటీ అధికారులకు నిర్దేశించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో కలిపి కొత్తగా 7.93 లక్షల మందిని పన్ను పరిధిలోకి తేనుంది. అందరికంటే ఎక్కువగా పుణె రీజియన్ విభాగానికి 10.14 లక్షల మందిని పన్ను పరిధిలోకి తేవాలని లక్ష్యాన్ని నిర్దేశించింది.
జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో మరో 9.30 లక్షల మందిని, గుజరాత్ ప్రాంత కార్యాలయానికి కొత్తగా 7.86 లక్షల మందిని ట్యాక్స్ చెల్లింపజేయాలని ఆదేశించింది. తమిళనాడులో మరో 7.64 లక్షల మందిని, పశ్చిమ బెంగాల్, సిక్కింలో 6.91 లక్షల మందిని, ముంబై రీజియన్లో 6.23 లక్షల మందిని, దేశ రాజధాని ఢిల్లీలో 5.32 లక్షల మందిని పన్ను పరిధిలోకి తీసుకురావాలని అనుకుంటున్నది.
పన్ను శాఖకు దేశవ్యాప్తంగా 18 ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. నిజానికి ఈ ఏడాది మే నెలలోనే భారీగా పన్ను చెల్లింపుదారులను చేర్చే వ్యూహాన్ని సీబీడీటీ ప్రారంభించింది. అయితే అది మంచి ఫలితాలను ఇవ్వకపోడవంతో... ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపునకు ఇంకా 8 నెలలు గడువు ఉండటంతో లక్ష్యాన్ని కోటికి పరిమితం చేసింది.