హైదరాబాద్ మెడలో మరో మణిహారం: మొబైల్ హబ్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా కే. చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరబోతున్నది. మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రాలు ఇప్పటి వరకూ ఇతర దేశాల్లోనే ఉన్న సంగతి తెలిసిందే.
సామాన్యుడి జీవితంలో ఎంతో ముఖ్య భూమిక పోషిస్తోన్న మొబైల్ ఇకపై మేడిన్ హైదరాబాద్ బ్రాండ్తో తయారు కానుంది. ఇందికు సంబంధించి దేశంలోనే మొట్టమొదటి మొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు పలు అంతర్జాతీయ మొబైల్ కంపెనీలు ముందుకు వచ్చాయి.
ఈ మొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ ద్వారా సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం, పలు అంతర్జాతీయ కంపెనీలతో సూత్రప్రాయ అంగీకారం కుదుర్చుకుంది.
దీనికి సంబంధించి పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ను కలిశారు. మొబైల్ హాబ్ ఏర్పాటుకు అవసరమైన స్థలం కేటాయించడంతోపాటు ఇతర సదుపాయాలు కల్పించాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
వీటితో పాటు మొబైల్ హబ్ ఏర్పాటుకు ఇంకా ఏమేంకావాలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇవ్వాలని, తద్వారా ప్రభుత్వం ఏం చేయాలనే విషయంలో స్పష్టత వస్తుందని తనను కలిసిన మొబైల్ కంపెనీల ప్రతినిధులకు సీఎం సూచించారు. మొబైల్ హార్డ్వేర్ పరిశ్రమను నగరంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో తీసుకురానున్న పారిశ్రామిక విధానాన్ని, సింగిల్ విండో అనుమతుల విధానానాన్ని సీఎం కేసీఆర్ వారికి వివరించారు. ఇప్పటి వరకు మొబైల్ హార్డ్వేర్ రంగంలో చైనా ప్రధమ స్ధానంలో ఉందన్న సీఎం, భారతదేశంలో హైదరాబాద్ను ఈ రంగంలో అగ్రగామిగా నిలబెడదామని చెప్పారు.
కేసీఆర్ను కలిసినవారిలో ఇండియన్ సెల్యూలార్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు పంకజ్ మహీంద్రా, కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్హసీజా, ఫాక్స్కాన్ ఇంటర్నేషనల్ ప్రతినిధి యోయో, ఫాక్స్కాన్ ఇండియా ఎండీ జోహ్ఫాల్జర్, సిలికాన్ ఎండీ వై గురు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి రేటినేని, వాటర్ వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి టోనీ తదితరులు ఉన్నారు.
రంగారెడ్డి జల్లా పరిధిలోకి వచ్చే మామిడిపల్లి, రావిర్యాల, మహేశ్వరం ప్రాంతాల్లోని భూములను పరిశీలించారు. మొబైల్ హార్డ్వేర్ పరిశ్రమ ఏర్పాటుకు ఈ ప్రాంతం అనువుగా ఉందని ప్రతినిధులు సంతృప్తి వ్యక్తంచేశారు.