రెపో రేటు పావు శాతం తగ్గింపు, నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: మంగళవారం స్టాక్మార్కెట్లకు ఒకేసారి రెండు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షతో భారీ నష్టాల బాట పట్టిన స్టాక్మార్కెట్లు వర్షాభావ పరిస్థితులపై భారత వాతావరణశాఖ(ఐఎండీ) అంచనాలతో మరింతగా నష్టపోయాయి.
ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు. ఈ సందర్భంగా రాజన్ మాట్లాడుతూ రెపోరేటును 0.25 శాతం తగ్గించినట్లు చెప్పారు. దీంతో ప్రస్తుతం 7.5గా ఉన్న రెపోరేటు 7.25కు తగ్గింది. అయితే, నగదు నిల్వల నిష్పత్తి యథాతథంగా ఉంటుందని తెలిపారు.
జనవరి నాటికి ద్రవ్యోల్బణం 6 శాతానికి చేరుకుంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇది ఇలా ఉంటే, వచ్చే ఆర్ధిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను 7.8 నుంచి 7.6 శాతానికి ఆర్బీఐ తగ్గించింది. ఆగస్టు నెలాఖరుకు కొత్త బ్యాంకులకు లైసెన్సులు మంజూరు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రెపో రేటుని పావు శాతం తగ్గించడంతో బ్యాంకింగ్ రంగ షేర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఆర్బీఐ రెపో రేటుని 0.25 శాతానికి తగ్గించడంతో స్టార్ మార్కెట్లు భారీ నష్టపోయాయి. బీఎస్సీ సెన్సెక్స్ 660 పాయింట్లు నష్టపోగా, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 196 పాయింట్లు నష్టపోయింది.
రుతుపవనాల ఆలస్యంతో వర్షాభావ, కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ సారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షపాతం 93 నుంచి 88శాతానికి తగ్గుతుందని ఐఎండీ అంచనా వేయడంతో స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి.