రిలయన్స్ను అధిగమించి, అత్యుత్తమ కంపెనీగా టీసీఎస్
న్యూఢిల్లీ: అత్యుత్తమ భారతీయ కంపెనీల జాబితాలో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అగ్రస్ధానంలో నిలిచింది. డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ 500 కంపెనీలతో రూపొందించిన ఈ జాబితాలో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా నెంబర్ వన్ స్ధానాన్ని కైవసం చేసుకుంది.
రెండో స్ధానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, మూడో స్ధానంలో ఐటీసీకి లభించింది. ఆ తర్వాత స్ధానాల్లో ఓఎన్జీసీ (4), కోల్ ఇండియా (5), ఇన్పోసిస్ (6), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (7), హెచ్డీఎఫ్సీ (8), హిందుస్థాన్ యూనిలీవర్ (9), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (10) నిలిచాయి.
గడచిన ఏడాదిన్నర కాలంలో భారత్ ఆర్ధిక వ్యవస్ధ అవకాశాలపై అసావహ దృక్పథం పెరిగిందని, కంపెనీల పనితీరు మెరుగుపడిందని డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ కౌశల్ సంపత్ వెల్లడించారు. 2015 జాబితాలో 51 కొత్త కంపెనీలు చేరగా, గత ఏడాది వాటి సంఖ్య 45గా ఉందని తెలిపారు.
గతేడాది మూడో త్రైమాసికంలో టాప్ 500 కంపెనీల త్రైమాసిక ఫలితాలు లాభాల్లో సాగాయని పేర్కొన్నారు. 2013-14తో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం ఈ 500 కంపెనీల్లో వృద్ధి రేటు 11.7 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గిందని అన్నారు. సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులతో పాటు డిమాండ్ ఆశించిన స్థాయిలో లేకపోవటం వృద్ది రేటును దెబ్బతీసిందని సంపత్ తెలిపారు.