'వాయిస్' పాస్వర్డ్ సేవలను ప్రవేశపెట్టిన ఐసీఐసీఐ
దేశీయ అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తాజాగా 'వాయిస్' పాస్వర్డ్ ఆధారిత సేవలను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఫోన్ బ్యాంకింగ్ లావాదేవీలు జరిపేటప్పుడు, వినియోగదారుడి గొంతు గుర్తించి లావాదేవీలు నిర్వహించే సౌలభ్యం ఉంటుందని ప్రకటించింది.
పిన్ నంబర్లు, పాస్వర్డ్లు టైప్ చేయాల్సిన అవసరం లేకుండా, ఖాతాదారుల వాయిసే పాస్వర్డ్గా ఉపయోగపడుతుంది. బ్యాంక్ కాల్సెంటర్ ద్వారా ఈ లావాదేవీలు చేయవచ్చని ముంబైలోని ఐసీఐసీఐ బ్యాంకు ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇందుకోసం, కస్టమర్ల వాయిస్ ప్రింట్ను బ్యాంకు ముందుగా సేకరిస్తుంది. వాయిస్ మాడ్యులేషన్, వేగం, మాటతీరు, ఉచ్చారణ తదితర వంద రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒకరి మాట తీరు మరొకరు అనుకరించినా గుర్తుపట్టే విధంగా ఈ సర్వీసును రూపొందించినట్లు ఐసీఐసీఐ బ్యాంకు ఛైర్మన్ చందా కొచ్చర్ తెలిపారు.
దీనివల్ల ఫోన్ బ్యాంకింగ్ లావాదేవీలు మరింత సురక్షితంగా జరపవచ్చని అన్నారు. స్మార్ట్ఫోన్లు ఉపయోగించే కస్టమర్లు 16 అంకెల కార్డు నంబరును, 4 అంకెల పిన్ నంబరును తప్పులు లేకుండా ఎంటర్ చేయడంలో ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో ఈ వాయిస్ ఆధారిత సర్వీసు ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
బ్యాంకులో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ నుంచి వినియోగదారుడు ఎప్పుడైనా కాల్ చేస్తే, సదరు వాయిస్ ప్రింట్తో సరిపోల్చి చూసుకుని తదుపరి లావాదేవీలకు అనుమతినిస్తుంది. ఈ సర్వీసు ద్వారా లావాదేవీలకు మరింత భద్రత చేకూరుతుందని, వినియోగదారులకు సౌలభ్యం, భద్రత లభిస్తాయని ప్రకటనలో ఐసీఐసీఐ బ్యాంకు పేర్కొంది.