హీరో Vs హోండా: 'అలాంటి ప్రకటనలతో తప్పుదారి పట్టించొద్దు'
పాతిక సంవత్సరాలుగా భారత్లో కలిసి వ్యాపారం చేసి, టూ వీలర్స్ విక్రయ మార్కెట్లో ప్రధాన పోటీదార్లుగా మారిని హీరో మోటోకార్ప్, హోండా సంస్థల మధ్య మాటల యుద్ధం మొదలైంది. హీరో కొత్త బైకు స్ప్లెండర్ ఐ స్మార్ట్ లీటరు పెట్రోల్కు 102.5 కిలో మీటర్ల మైలేజి ఇస్తుందని హీరో సంస్ధ ప్రకటించడంపై జపాన్ తయారీదారు హోండా అభ్యంతరం వ్యక్తం చేసింది.
అలాంటి ప్రకటనలతో వాహనదారులను తప్పుదోవ పట్టించేలా ఉందని, ఏమాత్రం వాస్తవికంగా లేవని హోండా ఆర్ అండ్ డీ సెంటర్ ఇండియా (హెచ్ఆర్ఐడీ) ప్రెసిడెంట్, సీఈవో కైజీ కాసా మాట్లాడుతూ 'మేం ఒక్క విషయాన్ని చెప్పదలచుకున్నాం. ఇలాంటి ప్రకటనలు తప్పుదారి పట్టించేవి, వాస్తవికంగా లేనివి' అని అన్నారు. అన్ని విధాలా అనుకూలమైన పరిస్ధితుల్లో సైతం ఇలాంటి మైలేజి అసాధ్యమని కొట్టిపారేశారు.
దీనిపై హీరో మోటోకార్ప్ స్పందిస్తూ, తమ బైకు ఇంధన సామర్ధ్య విలువలకు కేంద్ర ప్రభుత్వ అధీకృత ఏజెన్సీ ఐక్యాట్(ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్టెక్నాలజీ) సర్టిఫికెట్ ఇచ్చిందని, ఇది ఈ పరీక్షా ఫలితాలను ప్రశ్నించడమంటే, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు, నియమావళిని ప్రశ్నించినట్టేనని హీరో బదులిచ్చింది.