ఫోర్బ్స్: మళ్లీ మళ్లీ అగ్రస్థానం ముకేశ్ అంబానీదే
ముంబై: ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన భారతీయుడిగా తిరిగి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా సవరించిన ధనికుల జాబితా వివరాల ప్రకారం అయన సంపద 1,960 కోట్ల డాలర్లుగా నమోదైంది. దాదాపు ఏడు వారాలపాటు మొదటి స్థానంలో నిలిచిన సన్ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ రెండో స్థానానికి పడిపోయారు.
స్టాక్ మార్కెట్లో సోమవారం కంపెనీల షేర్ల ధరల్లో వచ్చిన మార్పులే ఇందుకు కారణమని ‘ఫోర్బ్స్' తెలిపింది. గతవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.55 శాతం నష్టపోయింది. కానీ సన్ఫార్మా షేర్లు 2 శాతం క్షీణించడంతో 45 కోట్ల డాలర్లు నష్టపోయిన సంఘ్వీ సందప 1,930 కోట్ల డాలర్లకు తగ్గింది. దీంతో ప్రపంచవ్యాప్త జాబితాలో ముకేశ్ అంబానీ 46వ స్థానంలో, సంఘ్వీ 48వ స్థానంలో ఉన్నారు.
గ్లోబల్ టాప్-50లో వీరిద్దరికి మాత్రమే స్థానం దక్కింది. గతనెల 2న ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రస్తుత సంవత్సరానికి ప్రపంచవ్యాప్త ధనికుల జాబితాను ప్రకటించింది. అందులో ముకేశ్ 39వ స్థానంలో, సంఘ్వీ 44వ స్థానంలో నిలిచారు. అయితే స్టాక్ మార్కెట్ పరిణామాలతో రెండు రోజుల్లోనే సంఘ్వి ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన భారతీయుడిగా మొదటి స్థానానికి చేరుకుంటే అంబానీ రెండో స్థానానికి పడిపోయారు.
మళ్లీ అదే స్టాక్ మార్కెట్ మార్పులతో ఇపుడు అంబానీ మొదటి స్థానానికి, సంఘ్వి రెండో స్థానానికి చేరారు. తాజా సమాచారం ప్రకారం.. అజీమ్ ప్రేమ్జీ మూడో స్థానంలో ఉండగా.. స్టీల్ టైకూన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ నాలుగో స్థానంలో ఉన్నారు. హెచ్సీఎల్ చైర్మన్ శివ్నాడార్ ఐదో స్థానంలో నిలిచారు. కుమార మంగళం బిర్లా, ఉదయ్ కొటక్, సునీల్ మిట్టల్, సైరస్ పూనావాలా, గౌతమ్ అదానీలు టాప్ పది స్థానాల్లో ఉన్నారు.
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సుమారు రూ. 50,97,444 కోట్ల ఆస్తులతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. స్టాక్ మార్కెట్ మార్పులతో గత ఏడు వారాల్లో గేట్స్ ఆస్తుల విలువ 7,920 కోట్ల డాలర్ల నుంచి 8,000.3 కోట్ల డాలర్లగా ఉంది.