నాపై డియాజియో తప్పుడు ఆరోపణలు: మాల్యా, మార్కెట్ల పతనం
న్యూఢిల్లీ: సోమవారం విజయ్ మాల్యాకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్ స్టాక్స్ ఒక్కసారిగా పతనమయ్యాయి. ఇందుకు కారణం శనివారం జరిగిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యూఎస్ఎల్) బోర్డు సమావేశంలో మాల్యాను ఛైర్మన్ పదవితో పాటు బోర్డు డైరెక్టర్గా తప్పుకోవాలని సూచించడమే.
ఏప్రిల్ 25, 2015న జరిగిన బోర్డు సమావేశంలో కంపెనీ ఫైనాన్స్ హెడ్గా వినోద్ రావుని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా కంపెనీ సెక్రటరీగా వి. రామచంద్రన్ను నియమిస్తూ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈయన నియామకం మే 1 నుంచి అమల్లోకి రానుంది.
ఇక డియాజియో సంస్థ నిధులను కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్తోపాటు యూబీ గ్రూపునకు చెందిన ఇతర సంస్థల్లోకి మళ్లించారని విజయ్ మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యూఎస్ఎల్ ఇతర కంపెనీలకిచ్చిన రుణాలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు గతేడాది సెప్టెంబర్లో డియాజియో ప్రకటించింది.
అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థ అయిన పీడబ్ల్యూసీకి ఈ బాధ్యతలు అప్పజెప్పింది. 2010 నుంచి 2013 మధ్యకాలంలో పలు లావాదేవీలకు చెందిన నిధులు యూబీ గ్రూపు సంస్థలకు మళ్లించినట్లుగా ఆ దర్యాప్తులో తేలింది. జూలై 3, 2013 వరకు కంపెనీకి రావాల్సిన రుణ బకాయిల మొత్తం రూ. 1,337 కోట్లుగా ఉంది.
నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లింపు జరిగినట్లు ఆడిట్ సంస్ధ పీడబ్ల్యూసీ దర్యాప్తులో తేల్చింది. ఇది ఇలా ఉంటే యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యూఎస్ఎల్) బోర్డు పదవి నుంచి తనను తీసివేసే అధికారం కేవలం షేర్ హోల్డర్లకు మాత్రమే ఉందని సంస్థ చైర్మన్ విజయ్ మాల్యా అంటున్నారు. తన పదవుల నుంచి తప్పుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
డియాజియా తనపై తప్పడు ఆరోపణలు చేస్తుందని మాల్యా అన్నారు. యునైటెడ్ స్పిరిట్స్లో వాటా కొనుగోలు చేయడానికి ముందే నాలుగు నెలలపాటు సంస్థ ఆర్థిక వ్యవహారాలను పరిశీలించిందని, కంపెనీకి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవాల గురించి ముందస్తుగానే సమాచారం ఇచ్చామని విజయ్ మాల్యా తెలిపారు.