ఐసీఐసీఐ ట్యాప్ ఎన్ పే: డబ్బు వినియోగం తగ్గించేందుకే..!
డెబిట్/క్రెడిట్ కార్డులకు భిన్నంగా, తక్కువ చెల్లింపుల కోసం నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్ (ఎన్ఎఫ్సీ) సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే ‘ట్యాప్ ఎన్ పే'ను ఐసీఐసీఐ బ్యాంకు సోమవారం ప్రారంభించింది. టెక్ మహీంద్రా బ్యాంక్తో కలిసి ఈ సర్వీస్ను ప్రారంభించింది.
ఈ సర్వీస్ ద్వారా కొనుగోళ్లు జరిపిన సందర్భంలో నగదును వినియోగించకుండానే చెల్లింపులు చేయవచ్చు. ఈ సర్వీసుని వినియోగించుకునేందుకు ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి, ప్రత్యేక దరఖాస్తులేమీ అందించాల్సిన అవసరం లేదని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సభర్వాల్ తెలిపారు.
ఈ సందర్భంగా టెక్ మహీంద్రా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ కస్టమర్లకు సరికొత్త చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఉదాహారణకు ఏదైనా సంస్ధలో పనిచేసే ఉద్యోగులు అక్కడి క్యాంటీన్లలో చెల్లింపుల కోసం ఎక్కువ సేపు క్యూలో నిల్చోకుండా ఈ విధానం ద్వారా నగదు చెల్లించవచ్చు.
ఇందుకోసం గాను క్యాంటీన్ నిర్వహకులు ముందస్తుగా బ్యాంకు వద్ద నమోదు చేసుకోవాలి. ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు, మిగతా బ్యాంకు ఖాతాదారులు కూడా విధానంలో నగదు చెల్లింపులు జరపవచ్చు. ఇందుకోసం ఖాతాదారుడు తన మొబైల్లో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ని నిక్షిప్తం చేసుకోవాలి.