కొత్త రిటర్న్(ఐటీఆర్) ఫామ్పై పునః సమీక్ష
కొత్తగా రూపొందించిన ఆదాయ పన్ను రిటర్న్(ఐటీఆర్) ఫామ్ ఫార్మాట్ను పునః సమీక్షించనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ ప్రకటించింది. ఐటీఆర్ ఫామ్లను మరింత సరళం చేయాలంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారని, ఈ మేరకు చర్యలు తీసుకుంటామని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు.
కొత్త రిటర్న్ ఫామ్ల ద్వారా పన్ను చెల్లింపుదారులు దేశంలో తమ పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాలన్నింటి వివరాలతో పాటు విదేశీ పర్యటనలు, ఆధార్ నంబర్ వాటికి సంబంధించి అవసరమైన దానికన్నా ఎక్కువ సమాచారాన్ని పొందుపరచాల్సి ఉండటంతో, పన్ను చెల్లింపుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఐటీఆర్ ఫామ్ కొత్త ఫార్మాట్ను ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) శుక్రవారం ఆమోదించిన సంగతి తెలిసిందే. దీంతో ఐటీఆర్-1, ఐటీఆర్-2లను సమర్పించే పన్ను చెల్లింపుదారులు వారికున్న మొత్తం బ్యాంక్ ఖాతాలు, అకౌంట్ నంబర్, ఖాతా ఉన్న శాఖ చిరునామా, ఐఎఫ్ఎస్సీ కోడ్, మార్చి 31 వరకు అకౌంట్లోని నగదు నిల్వ, తదితర విషయాలన్నింటినీ వెల్లడించాలనే నిబంధనను పెట్టింది.
దీంతో పాటు పన్ను చెల్లింపుదారులకు విదేశాల్లో ఏమైనా ఆస్తులుంటే వాటిని కూడా తప్పనిసరిగా బహిర్గతం చేయాలనే నిబంధనను ఐటీ శాఖ విధించింది. దీంతో అవసరమైన దానికన్నా ఎక్కువ సమాచారాన్ని ఐటీ శాఖ అడుగుతుందని పన్ను చెల్లింపుదారులు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.