ముగింపు: మనీ ఆర్డర్ సర్వీసుని నిలిపివేయనున్న ఇండియా పోస్ట్
బెంగుళూరు: దాదాపు 135 సంవత్సరాల నుంచి తన సుధీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్న మనీ ఆర్డర్ వ్యవస్థ ఇక నుంచి మన దేశంలో కనిపించదు. ఇండియా పోస్ట్ అందిస్తోన్న ఈ సర్వీసుని త్వరలో నిలిపివేయనుంది. రాబోయే రోజుల్లో మనీ ఆర్డర్ సర్వీసు ఇక చరిత్రగా మిగలనుంది.
దాదాపు 1880 నుంచి భారత ప్రజల మనసుల్లో సుస్ధిరస్ధానాన్ని సంపాదించుకున్న ఈ మనీ ఆర్డర్ సర్వీసు దేశంలోని 155,000 పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎంతో మందికి నగదుని ఇంటికి డెలివరీ చేసింది. 2008లో ఇంటర్నెట్ సాంకేతిక వచ్చిన తర్వాత మనీ ఆర్డర్ సర్వీసుని ఉపయోగించడం పూర్తిగా మానేశారు.
ఇటీవల కాలంలో నగదు బదిలీ అంతా కూడా ఎలక్ట్రానిక్ రూపంలోనే జరుగుతుంది. మనీ ఆర్డర్ సర్వీసుని నిలిపివేయడంపై డిప్యూటీ జనరల్ డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ శిఖా మథుర్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం 'మనకు ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్స్, ఇనిస్టాంట్ మనీ ఆర్డర్స్ లాంటివి ఉన్నాయి. సాధారణ మనీ ఆర్డర్తో పోలిస్తే అవి చాలా వేగవంతంగా, సులభంగా ఉంటున్నాయి' అని అన్నారు.
అలాంటి సులభ, సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన నేపథ్యంలో మనీ ఆర్డర్ సర్వీసుని ఉపయోగించే వారు బాగా తగ్గిపోయారని పేర్కొన్నారు. మనీ ఆర్డర్ సర్వీసు స్ధానంలో ఇనిస్టాంట్ మనీ ఆర్డర్ (ఈఎమ్వో), ఐఎమ్వో పనిచేయనున్నట్లు తెలిపారు. ఇక ఇనిస్టాంట్ మనీ ఆర్డర్ విషయానికి వస్తే, రూ. 1,000 నుంచి రూ. 50,000లకు ఇండియా పోస్ట్ పెంచిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
ఇండియా పోస్ట్ వెల్లడించిన సమాచారం ప్రకారం పోస్టల్ అధికారిక ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి ఈ మనీ ఆర్డర్ నగదుని బదిలీ చేసేవారట. 1880ల్లో ప్రజలు ఇంటి అద్దెలు, రెవెన్యూలు చెల్లించేందుకు సుదూర ప్రాంతాలకు వెళుతూ ఉండేవారట. ప్రజల ప్రయాణ భారాన్ని తగ్గించే భాగంలో ఈ మనీ ఆర్డర్ సర్వీసుని అందుబాటులోకి తీసుకొచ్చారుంట.