ఐపీఓ జాబితాలో మరో ఐదు సంస్ధలు: సెబీకి దరఖాస్తు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఆఫరింగ్కు(ఐపీఓ) వచ్చేందుకు తాజాగా మరో ఐదు సంస్థలు జాబితాలో చేరాయి. మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ మండలి సెబీ వద్ద ఈ సంస్ధలు తమ దరఖాస్తులను సమర్పించాయి. వీటిలో నవకార్ కార్పొరేషన్, క్యాథలిక్ సిరియన్ బ్యాంక్, దిలీప్ బిల్డ్కాన్, ప్రభాత్ డైరీ, ఎంఎం ఆటో ఇండస్ట్రీస్ సంస్థలున్నాయి.
ఈ ఐదు కంపెనీలు కలిపి మార్కెట్ నుంచి సేకరించాలనుకుంటున్న మొత్తం రూ. 2000 కోట్ల పైమాటే. సెబీ నుంచి ఆమోదం రాగానే ఈ సంస్థలు ఐపీఓకు రానున్నాయి. ఇక మహారాష్ట్రకు చెందిన నవకార్ కార్పోరేషన్ ఐపీఓలో ఈక్విటీ వాటా విక్రయం ద్వారా రూ.600 కోట్ల సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ మార్కెట్ నుంచి రూ. 400 కోట్లు సమీకరించాలనే ఆలోచనలో ఉంది. దిలీప్ బిల్డ్కాన్ రూ. 650 కోట్లు, ప్రభాత్ డైరీ రూ. 300 కోట్లు సమీకరించాలని అనుకున్నాయి. పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎంఎం ఆటో ఇండస్ట్రీస్ 53 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించాలని సూస్తుంది.
2015 జనవరి నుంచి పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సెబీ వద్ద అప్లికేషన్ సమర్పించిన కంపెనీల సంఖ్య 12కు చేరింది. ఈ మూడు సంస్థల కంటే ముందు పెన్నార్ ఇంజినీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్, అమర్ ఉజాలా పబ్లికేషన్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్, ఎస్హెచ్ కేల్కర్ అండ్ కంపెనీ, శ్రీ శుభం లాజిస్టిక్స్, ప్రెసిషన్ కామ్షాఫ్ట్, ఎస్ఎస్ఐపీఎల్ రిటైల్ కూడా సెబీ వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ను (డీఆర్హెచ్పీ) దాఖలు చేశాయి. ఈ 12 కంపెనీలు సేకరించనున్న నిధుల విలువ రూ. 4000 కోట్లు.