ఐఆర్సీటీసీ రూపే కార్డు: ఏ విధంగా ఉపయోగపడుతుంది..?
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులు ఇక నుంచి తమ టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి, షాపింగ్, వివిద సేవల బిల్లుల చెల్లింపులకు రూపే ప్రీపెయిడ్ డెబిట్ కార్డులను ఉపయోగించవచ్చు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత జాతీయ చెల్లింపుల కార్పోరేషన్ (ఎన్పీసీఐ) భాగస్వామ్యంతో ఐఆర్సీటీసీ ఈ కార్డులను మంగళవారం ఆవిష్కరించింది.
రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రకటించిన ఆర్ధిక అభివృద్ధిలో ఇది ఒక భాగమని, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాలేని వారు సైతం ఈ కార్డులు తీసుకోవచ్చని వివరించారు. భారత కంటైనర్ కార్పోరేషన్ రూ. 10 కోట్లతో నిర్మించిన కార్గో సెంటర్ను ఆయన ప్రారంబించారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో లేదా ఐఆర్సీటీసీ ఇంటర్నెట్ ద్వారా వీటిని తీసుకోవచ్చని ఐఆర్సీటీసీ ఛైర్మన్, ఎండీ మనోజ్ తెలిపారు. ప్రస్తుతం రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి వీటిని ప్రారంభించామని, కొనుగోళ్లు, వివిధ సేవల బిల్లుల చెల్లింపు సదుపాయాలను మరికొన్ని రోజుల్లో వీటికి జత చేస్తామని అన్నారు.