నకిలీ బ్యాంకుతో రూ. 196 కోట్లు లూటీ: బీబీసీ
న్యూఢిల్లీ: చైనాలో నకిలీ బ్యాంకు పేరుతో ప్రజల మోసపోయారు. నాన్జింగ్ నగరం తూర్పున నకిలీ బ్యాంకును ఏర్పాటు చేసి సుమారు 200మంది వద్ద బ్యాంకులో నగదు జమ చేయించి ఆ తర్వాత పత్తా లేకుండా ఉడాయించారని బీబీసీ తన నివేదికలో పేర్కొంది.
వివరాల్లోకి వెళితే... నాన్జింగ్ నగరం తూర్పున నకిలీ బ్యాంకును ఐదుగురు సభ్యుల బృందం ఏర్పాటు చేసింది. అన్ని బ్యాంకుల మాదిరే ఈ నకిలీ బ్యాంకు కూడా కార్యకలాపాలను నిర్వహించింది. అధిక వడ్డీ ఆశ చూపడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఈ బ్యాంకులో నగదును డిపాజిట్ చేయడం మొదలు పెట్టారు.
అలా ఆ నకిలీ బ్యాంకులో సుమారు 32 మిలియన్ డాలర్లు (సుమారు 196 కోట్లు) నగదు జమ అయింది. కస్టమర్లకు ఇస్తామన్న వడ్డీ ఇవ్వకపోడవంతో.. వారు నగదుని తిరిగి ఇవ్వాలని కోరారు. దీంతో ఇదే అదనుగా భావించి ఐదుగురు సభ్యులు మొత్తం డబ్బుతో ఉడాయించారు. ఈ నకిలీ బ్యాంకు మోసంలో ఒక్కొక్కరు 1.9 మిలియన్ డాలర్లును తమ వంతు వాటాగా పంచుకున్నారు.
పోలీసుల విచారణలో అసలు బ్యాంకును ఏర్పాటు చేసేందుకు లైసెన్సు పొందకుండానే వారు కార్యకలాపాలు కొనసాగించారని వెల్లడైంది. ఈ నకిలీ బ్యాంకు తన కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం విశేషం. ఈ నకిలీ బ్యాంకు స్కామ్లో ఐదుగురిని అరెస్టు చేసినట్లు బీబీసీ పేర్కొంది.