పుంజుకుంటున్నాం: జైట్లీ, గుజరాత్-బెంగాల్ సమ్మిట్పై ఆసక్తికర వ్యాఖ్య
న్యూఢిల్లీ: కరెంట్ ఖాతా లోటు ఆమోదయోగ్యమైన స్థాయిలో ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పతనం కావడం వంటివాటి మధ్య దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం అన్నారు.
ఆర్థిక క్రమశిక్షణ, మౌలికరంగంలో పెట్టుబడుల ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నార్త్బ్లాక్లో ఆర్థికవేత్తలతో ముందస్తు బడ్జెట్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో జీడీపీ వృద్ధిరేటు 5.5 శాతంగా నమోదైందని, గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో 4.9 శాతానికే పరిమితమైందని చెప్పారు.
గత ఆర్థిక సంవత్సరం మొత్తం 4.7 శాతంగానే జీడీపీ వృద్ధి ఉందన్న ఆయన ఈ ఆర్థిక సంవత్సరం 5 శాతం ఎగువన సాధిస్తామన్నారు. ఐఐఎమ్ అహ్మదాబాద్ నుంచి ఎర్రోల్ డిసౌజా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి రోహిణి సోమనాథన్, ఢిల్లీ ఐఎస్ఐ నుంచి చేతన్ ఘటె, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ నుంచి సబ్యసాచి కార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జైట్లీ ఆసక్తిక వ్యాఖ్యలు
వాణిజ్య, పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణకు గుజరాత్ ప్రభుత్వం నిర్వహించిన ఉజ్వల గుజరాత్ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తి అని ఆర్థిక మంత్రి జైట్లీ అంటున్నారు. గుజరాత్ సదస్సు ఏకంగా 25 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లోనే ఉజ్వల గుజరాత్ సదస్సు సందర్భంగా 21 ఎంవోయులపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసింది.
కొద్ది రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సదస్సుతో పోలిస్తే గుజరాత్ సదస్సుకు అసాధారణ స్పందన లభించిందంటున్నారు. పశ్చిమ బెంగాల్ సదస్సు సందర్భంగా 2.5 లక్షల కోట్ల రూపాయల విలువైన ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు మాత్రమే వచ్చాయి.
పదిహేను రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు సదస్సులను దృష్టిలో ఉంచుకొని.. ఫేస్బుక్లో ‘‘రెండు అంతర్జాతీయ సదస్సుల కథ'' పేరుతో జైట్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ల ఆకర్షణకు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పోటీ పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అయితే ఎర్ర తివాచీలు పరిచి, ప్రతిబంధకాలు లేని వాణిజ్య అనుకూల వాతావరణం కల్పించే రాష్ట్రాల వైపే ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారని అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల ఆకర్షణకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఫేస్బుక్ పోస్టింగ్లో జైట్లీ అభినందించారు. ఈ విషయంలో మమతా బెనర్జీ సర్కారుకు పూర్తి స్థాయిలో తాము మద్దతుగా నిలుస్తామన్నారు.
అయితే ఇన్వెస్టర్ల విశ్వాసం చూరగొనడానికి మమతా బెనర్జీ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉందన్నారు. పారిశ్రామిక, వాణిజ్య అనుకూల విధానాలు అందుకు అనుగుణమైన సంస్కరణలను ఎప్పటికప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బెంగాల్ రాష్ట్ర అభివృద్ధికి చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.
వాస్తవానికి దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో పశ్చిమ బెంగాలే పారిశ్రామిక రంగానికి అత్యంత కీలకమైన ప్రాంతంగా ఉన్నదని చెప్పారు. 60వ దశకంలో నక్సలైట్ల సమస్యతో ప్రారంభించి, వామపక్ష ప్రభుత్వాలు అనుసరిస్తూ వచ్చిన విధానాల వల్ల పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయన్నారు.