పేరుకుపోయిన పీఎఫ్ సొమ్మును ఆధార్ ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి: మోడీ
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఖాతాల్లో పేరుకుపోయిన రూ. 27 వేల కోట్లను సంబంధిత కార్మికులకు చెల్లించే ఏర్పాట్లను చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. గుజరాత్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శ్రమ్ యోగీ కల్యాణ్ మేలా కార్యక్రమం సందర్బంగా రాష్ట్రంలో 20 ప్రదేశాల్లోని కార్మికులను ఉద్దేశించి వారణాసి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ మాట్లాడారు.
దేశంలోని కార్మికులు కొద్ది నెలలు ఒక చోట పనిచేసి, ఆ తర్వాత మరో చోటకు వెళ్లిపోతుంటారని, అలాంటి సందర్భాల్లో తన పీఎఫ్ ఖాతాలో జమ అయినటువంటి చిన్నపాటి మొత్తాన్ని తీసుకోవడానికి వెనక్కి వచ్చే పరిస్ధితుల్లో ఉండరని, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వద్ద రూ. 27 వేల కోట్లు పేరుకుపోయినట్లు తన దృష్టికి రావడం ఆశ్చర్యపోయానని మోడీ చెప్పారు.
అలాంటి కార్మికులను ఆధార్ కార్డు ద్వారా గుర్తించి వారి బ్యాంకు ఖాతాల్లోకి వారి డబ్బును జమ చేయాలని తన ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఒక్క రోజు కూడా పనిని కోల్పోకుండా కార్మికులు వారి వంతు కృషి చేస్తున్నారని, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు భారీగా రావడానికి ఇదొక కారణమని అన్నారు.
దేశ వ్యాప్తంగా ఉన్న కార్మికులకు సరైన గౌరవం, గుర్తింపు ఇచ్చేందుుకు గాను కేంద్ర ప్రభుత్వం శ్రమయేవ జయతే ఉద్యమాన్ని ప్రారంభించిందన్నారు.
ఏజెంట్ల నియామించే ఆలోచనలో ఈపీఎఫ్వో
సంక్షేమ పథకాలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్వో భారీ స్థాయిలో ఏజెంట్లను నియమించుకునే ఆలోచనలో ఉన్నది. ఆదాయపు పన్ను డిపార్టుమెంట్ ఆధ్యర్యంలో పనిచేయనున్న ఈ ఏజెంట్లు వినియోగదారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సర్వీసులు అందించనున్నారని ఈపీఎఫ్వో సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కేకే జలాన్ తెలిపారు.
కార్మిక శాఖ అధ్యర్యంలో వీరికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు గుడ్ గవర్నెన్స్కార్యక్రమంలో ఆయన చెప్పారు. సోషల్ సర్వీస్ ఏజెంట్లు పోర్టబుల్ పీఎఫ్ ఖాతాలు, అకౌంట్ నంబర్స్కీంలపై వీరు సహయ సహాకారాలు అందించనున్నారు.