ఏటిఎంపై పరిమితులెందుకు?: ఆర్బిఐకి హైకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: ఏటిఎం కార్డుల వాడకంపై పరిమితి విధించాలన్న రిజర్వు బ్యాంకు నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఇది వినియోగదారులపై అనవసర భారం మోపడమేనని కోర్టు పేర్కొంది. దేశంలోని 6 మెట్రో నగరాల్లో ఏటిఎం వాడకం నెలకు ఐదు సార్లకు మించితే 20 రూపాయల మేర ఛార్జి వసూలు చేసుకోవచ్చని ఆర్బిఐ బ్యాంకులకు వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే.
అయితే సొంత కస్టమర్లపైన అనవసర భారం మోపడమెందుకని బ్యాంకులను కోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై ఫిబ్రవరి 18కల్లా తమ వాదనలు తెలియజేయాలని ఆర్బిఐ, ఐబిఎ, ఎస్బిఐలకు ఆదేశాలు జారీ చేసింది. ఏటిఎం వాడకంపై పరిమితులు విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్పై హైకోర్టు విచారణ చేపట్టింది.
3న బ్యాంకర్లతో ప్రధాని సమావేశం
బ్యాంకర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 3న సమావేశం కానున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సంస్కరణల కోసం ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు పుణెలో బ్యాంకర్లతో మోడీ సమావేశమవుతున్నారు.
రెండు రోజుల ఈ సమావేశాల్లో రెండో రోజు బ్యాంకర్లతో మోడీ చర్చించనుండగా, కన్సాలిడేషన్, ప్రభుత్వరంగ బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ, పెట్టుబడుల అవసరాలు, రుణాల వసూళ్లు, ఇతరత్రా సమస్యలు ఈ సందర్భంగా ప్రస్తావనకు రానున్నాయి.
ఈ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్తోపాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని మరికొందరు ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఫైనాన్షియల్ లిటరసీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ప్రాధాన్యతా రంగాలకు రుణాలు, మానవ వనరులు తదితర అంశాలపైనా చర్చలు జరపనున్నారు.