కోల్ ఇండియా సీఎండీగా 'సింగరేణి కాలరీస్ ఎండీ' భట్టాచార్య
న్యూఢిల్లీ: కోల్ ఇండియా సీఎండీగా సీనియర్ ఏఐఎస్ అధికారి ఎస్ భట్టాచార్య నియమితులయ్యారు. ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్. దీనికి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా భట్టాచార్య నియమితులయ్యారు. గత ఆరు నెలలుగా కోల్ ఇండియా సిఎండి పదవి ఖాళీగా ఉంది.
రెండు రోజుల క్రితం కోల్ ఇండియా సిఎండిగా ఎస్ భట్టాచార్యను కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదించినట్లు ఓ ఉన్నతాధికారి బుధవారం తెలిపారు. నియామక ఆదేశాలు కూడా సిద్ధమయ్యాయని చెప్పారు. దీంతో ఈ ఏడాది జూన్ 26 నుంచి కోల్ ఇండియా సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి ఎకె దూబే స్థానంలో భట్టాచార్య బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన 1986 బ్యాచ్ ఐఎఎస్ అధికారి నర్సింగరావు ఈ ఏడాది మే నెలలో రాజీనామా చేయడంతో కోల్ ఇండియా సిఎండి పదవి ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో కొత్త సిఎండి అనే్వషణ మొదలవగా, 12 మందికి జరిపిన ఇంటర్వ్యూలో 1985 బ్యాచ్కు చెందిన ఐఎఎస్ అధికారి ఎస్ భట్టాచార్యను కోల్ ఇండియా సిఎండి పదవికి గత వారం పిఇఎస్బి సిఫార్సు చేసింది. ప్రస్తుతం భట్టాచార్య సింగరేణి కాలరీస్ కంపెనీ సిఎండిగా ఉన్నారు.
2019 కల్లా వంద కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని కోల్ ఇండియా భావిస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరేందుకు తగిన వ్యూహాలను రచించేందుకు కొత్త సీఎండీ నియామకం దోహదం చేయనుందని భావిస్తున్నారు.