2014-15లో పీఎఫ్పై 8.75 శాతం వడ్డీకి కేంద్రం ఆమోదం
హైదరాబాద్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో)లోని 5 కోట్ల మంది చందాదారుల భవిష్య నిధి (పీఎఫ్) డిపాజిట్లపై 2014-15 ఆర్థిక సంవత్సరానికి కూడా 8.75 శాతం వడ్డీరేటును కొనసాగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
సాధారణంగా ప్రతి సంవత్సరం ఖాతాదారులకు చెల్లించాల్సిన వడ్డీరేటుపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి నేతృత్వంలో ఈపీఎఫ్వో ట్రస్టీల బోర్డు సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది. ఈపీఎఫ్వో ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ అంగీకారం తెలిపింది.
కేంద్ర కార్మిక శాఖ, ఐటీ శాఖ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రభుత్వ అనుమతి దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు లబ్ధి చేకూరనుంది. దీనితో పాటు నెలకు కనీస పింఛన్ రూ. 1,000 చెల్లింపు పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరం తదుపరి కూడా కొనసాగించేందుకు సీబీటి అంగీకరించింది.
ఈపీఎఫ్, పెన్షన్ తదితరాలకు సంబంధించిన క్లెయిమ్ల పరిష్కార సమయాన్ని 30 రోజుల నుంచి 20 రోజులకు కుదించాలని నిర్ణయించింది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ప్రయివేట్ రంగ బాండ్లలో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తున్న 10% నిధుల ను 15%కు పెంచే ప్రతిపాదన పరిశీలనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీబీటీ నిర్ణయించింది.