అక్రమాలపై కొరఢా ఝులిపించిన సెబి: 260 సంస్థలపై నిషేధం
ముంబై: అక్రమాలకు పాల్పడుతున్న సంస్థలపై మునుపెన్నడూ లేనివిధంగా స్టాక్మార్కెట్ రెగ్యులేటర్ సెబి కొరఢా ఝుళిపించింది. బ్లాక్మనీ లాండరింగ్, పన్ను ఎగవేత అనుమానాలపై సెబీ శుక్రవారం 260 సంస్థలపై నిషేధం విధించింది.
ఇందులో సెక్యురిటీ మార్కెట్లలోని పలువురు వ్యక్తులతోపాటు సంస్థలున్నాయి. కాగా, ఈ వ్యవహారంపై విచారణ జరిపాలని ఆదాయ పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ యూనిట్ తదితర ఏజెన్సీలకు సిఫార్సు చేయాలని కూడా సెబీ నిర్ణయించింది.
ఇక ఈ 260 సంస్థలను సెక్యురిటీ మార్కెట్ల నుంచి నిషేధించిన సెబీ.. సెక్యురిటీల్లో అమ్మకాలు, కొనుగోళ్లు, ఇతర ఏ లావాదేవీలకు దిగరాదని కూడా ఆదేశించింది. ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఎలాంటి లావాదేవీలకు దిగవద్దని హెచ్చరించింది. ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించరాదని స్టాక్ ఎక్స్చేంజ్లకు, డిపాజిటర్లకు స్పష్టం చేసింది.
కాగా, నిషేధానికి గురైన 260 సంస్థల్లో 152 సంస్థలు ఫస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన కేసులో నిషేధానికి గురవగా, మిగతా 108 సంస్థలు రాడ్ఫోర్డ్ గ్లోబల్ లిమిటెడ్కు సంబంధించిన కేసులో నిషేధానికి గురయ్యాయి.