ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఆర్బీఐ జరిమానా
న్యూఢిల్లీ: కెవైసి నిబంధనలను అతిక్రమించినందుకు గాను ఐసిఐసిఐ బ్యాంకుకు రూ. 50 లక్షలు, బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఒబి)కి రూ. 25 లక్షలు జరిమానాను రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించింది. ఇదే కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బిపిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది.
2013 ఆగస్టులో ‘ప్రఖ్యాత స్టాచుటరీ సంస్థ' ఆర్బిఐకి ఒక ఫిర్యాదు చేసింది. తమ సంస్థకు చెందిన కొందరు అధికారుల సాయంతో ఈ ఐదు బ్యాంకులు మోసపూరిత వ్యవహారాలకు పాల్పడుతున్నాయని ఆర్బిఐ దృష్టికి తెచ్చింది.
సంస్థ పేరిట ఈ ఐదు బ్యాంకుల్లో తప్పుడు అకౌంట్లు తెరుస్తున్నారని తెలిపింది. ఈ అకౌంట్లలో మోసపూరిత చెక్కులను, డిడిలను ఎన్క్యాష్ చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ ఫిర్యాదుపై ఈ ఏడాది జనవరిలో ఐదు బ్యాంకులపై ఆర్బిఐ దర్యాప్తు నిర్వహించి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
బ్యాంకులు ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందని ఆర్ బిఐ రెండు బ్యాంకులకు జరిమానా విధించి, మరో మూడింటిని హెచ్చరించింది. ఇకపై కెవైసి నిబంధనలను ఖచ్ఛితంగా పాటించాలని ఆర్బిఐ ఆదేశించింది.