ఈ-డయాగ్నసిస్పై బాబుకు చెప్పిన మంజుందార్ షా, విశాఖలో బయోకాన్
హైదరాబాద్: ప్రముఖ ఫార్మా కంపెనీ బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. తమ సంస్థ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ-డయాగ్నసిస్ కేంద్రాల పని తీరును ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబుకు వివరించారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రతి చిన్న వైద్య అవసరానికి నగరాలకు, పెద్ద ఆసుపత్రులకు రావాల్సిన పని లేకుండా ఈ-కేంద్రాల ద్వారా నగరాల్లోని వైద్యులతో వైద్య సాయం పొందవచ్చునని చెప్పారు. ఇప్పటికే ఒడిశాలో 50, రాజస్థాన్లో వంద ఈ-డయాగ్నసిస్ కేంద్రాలను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఏపీలో ఇలాంటివి 100 నుండి రెండువందల కేంద్రాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ఆమెకు చెప్పారు.
మజుందర్ షా మాట్లాడుతూ.. ఆరు నెలల్లో విశాఖలో తయారీరంగ యూనిట్ స్థాపించనున్నట్లు చెప్పారు. ఫార్మాసూటికల్ దిగ్గజం బయోకాన్ విశాఖలో తన యూనిట్ను నెలకొల్పడానికి ఆసక్తి చూపడం గమనార్హం. వచ్చే ఆరు నెలల్లో తమ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.