పిజ్జా కార్నర్ను కొనుగోలు చేసిన అమెరికాకు చెందిన పాపా జాన్స్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన పాపా జాన్స్ ఇంటర్నేషనల్ తన భారతీయ ప్రాంఛైజీ అయిన ఓమ్ పిజ్జా అండ్ ఈట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పిజ్జా కార్నర్ను కోనుగోలు చేసింది. ఓమ్ పిజ్జా అండ్ ఈట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ బంధువు అతుల్య మిట్టల్ ఒక ప్రమోటర్గా వ్యవహారిస్తున్నారు.
ఐతే ఎంత మొత్తానికి కొనుగోలు చేశారన్నది మాత్రం బయటకు వెల్లడించలేదు. దక్షణ భారత్లో పిజ్జా కార్నర్ స్టోర్లను విలీనం చేసుకోవడం కోసం పాపా జాన్స్ ఒప్పందం కుదర్చుకుంది. 2015 తొలి త్రైమాసికంలో ప్రస్తుత పిజ్జా కార్నర్ స్టోర్లన్నీ పాపా జాన్స్ బ్రాండెడ్ రెస్టారెంట్లుగా మారుతాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ కొనుగోలుపై పాపా జాన్స్ ఇండియా సీఈఓ జోసెఫ్ చెరియన్ను సంప్రదించగా, ఈ కొనుగోలు వల్ల భారతీయ మార్కెట్లోకి మరింతగా చొచ్చుకుపోవడానికి అవకాశం కలిగిస్తుందన్నారు. తక్కువ కాలంలో వృద్ది చెందడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కొనుగోలుతో మేం భారత్లో మూడవ అతిపెద్ద పిజ్జా సంస్ధగా అవతరిస్తామన్నారు.