తీహార్ జైలుకు 31 లక్షలు చెల్లించిన సహారా
న్యూఢిల్లీ: తీహార్ జైలు అధికార వర్గాలకు సహారా గ్రూప్ 31 లక్షల రూపాయలను చెల్లించింది. మదుపుదారుల సొమ్ము చెల్లించని కారణంగా సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ తీహార్ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. తన బెయిల్ కోసం 10,000 కోట్ల నిధులను సమీకరించడంలో భాగంగా విదేశాల్లోని లగ్జరీ హోటళ్ల విక్రయానికి వివిధ వర్గాలతో సుబ్రతా రాయ్ ఈ జైలు నుంచే చర్చలు జరుపుతున్నారు.
ఈ సందర్భంగా వినియోగిస్తున్న వీడియో కాన్ఫరెన్స్, ఇంటర్నెట్, ఫోన్, ఎయిర్ కండీషనర్ తదితర సదుపాయల ఖర్చులకుగాను ఈ 31 లక్షలను తీహార్ జైలుకు సహారా చెల్లించింది. హోటళ్ల విక్రయానికి సంబంధించి చర్చలకు జైలులోని కాన్ఫరెన్స్ గదిని వినియోగించుకునే వెసులుబాటును సుప్రీం కోర్టు సుబ్రతా రాయ్కి కల్పించింది.
దద్దరిల్లిన దలాల్ స్ట్రీట్
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం రికార్డుల మోత మోగించాయి. అమెరికా వృద్ధిరేటు గణాంకాలు, జపాన్ ప్రకటించిన ఆకస్మిక ఉద్దీపన పథకాలు మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయి. మదుపరుల కొనుగోళ్ల జోరుతో అటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ రెండూ సరికొత్త స్థాయికి చేరాయి. ఉదయం నుంచి లాభాల్లో కదలాడిన సూచీలు ముగింపు సమయం దగ్గరపడుతున్నకొద్దీ జోరును ప్రదర్శించాయి.
నరేంద్ర మోడీ ప్రభుత్వం మరిన్ని ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెడుతుందన్న అంచనాలు, ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో వృద్ధిరేటు పురోగమిస్తుందన్న ఆశాభావం, విదేశీ మదుపరుల పెట్టుబడుల ప్రవాహం మధ్య ఆల్టైమ్ హైని స్టాక్మార్కెట్లు తాకాయి. ఈ క్రమంలోనే సెనె్సక్స్ 519.50 పాయింట్లు ఎగబాకి 27,865.83 వద్ద ముగిస్తే, నిఫ్టీ 153 పాయింట్లు పుంజుకుని 8,322.20 వద్ద నిలిచింది. ముఖ్యంగా సెన్సెక్స్ ఈ వారం 1,014.78 పాయింట్లు పెరగగా, గడిచిన 10 రోజుల్లో 9 రోజులు అందుకున్న లాభం 1,866.49 పాయింట్లుగా నమోదైంది. ఇక ఇంట్రా-డే ట్రేడింగ్లో మదుపరుల కొనుగోళ్ల జోరుకు సరికొత్త స్థాయిని స్టాక్మార్కెట్ సూచీలు తాకాయి.
సెన్సెక్స్ 27,894.32 పాయింట్లను, నిఫ్టీ 8,330.75 పాయింట్లను అందుకున్నాయి. దీంతో గురువారం నమోదైన అన్ని రికార్డులు కనుమరుగయ్యాయి. గురువారం అమెరికా విడుదల చేసిన ఆర్థిక గణాంకాలు అంచనాలకు మించి నమోదవడం కూడా కలిసొచ్చిందని విశే్లషకులు అభిప్రాయపడ్డారు. జపాన్ సెంట్రల్ బ్యాంక్ ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్ల ప్రక్రియను పెంచడం మదుపరులను ఉత్సాహపరిచిందన్నారు.
ముందుగా నిర్ణయించిన దానికంటే మరో 30 ట్రిలియన్ యెన్ల మేర బాండ్లను కొనుగోలు చేయాలని జపాన్ సెంట్రల్ బ్యాంక్ నిశ్చయించుకుంది. తమ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా జపాన్ రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నిర్మాణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డిఐ) నిబంధనలను కేంద్రం సరళతరం చేయడం, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ బలపడటం కూడా భారీ కొనుగోళ్లకు దోహదపడిందన్నది మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.