క్షీణత: డాక్టర్ రెడ్డీస్ నికర లాభం 574 కోట్లు
హైదరాబాద్: దేశీయ ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ బుధవారం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను ప్రకటించిన ఏకీకృత నికర లాభాలు గతంతో పోల్చితే 16.82 శాతం క్షీణించాయి. ఈ జూలై-సెప్టెంబర్లో 574.1 కోట్ల రూపాయలుగా నమోదైతే, గత ఏడాది జూలై-సెప్టెంబర్లో 690.25 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి.
నికర ఆదాయం ఈసారి 3,587.81 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 3,357.45 కోట్ల రూపాయలుగా ఉంది. అమెరికా మార్కెట్లో మందగించిన వృద్ధి, భారత కరెన్సీతో పోల్చితే పతనమైన రష్యా, ఉక్రెయిన్ కరెన్సీల విలువ కారణంగానే లాభాలు ప్రధానంగా తగ్గుముఖం పట్టాయని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.
ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ కరెన్సీల విలువ క్షీణతతో దాదాపు 71 కోట్ల రూపాయల లాభాలు ఆవిరయ్యాయని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ హెచ్ఆర్ గ్లోబల్ అధిపతి, సిఎఫ్ఓ, అధ్యక్షుడు సౌమెన్ చక్రబర్తి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.
కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని అల్లకల్లోలం చేసిన హుధుద్ తుఫాను కారణంగా సంస్థకు 40 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని చక్రబర్తి తెలియజేశారు. ఉత్తరాంధ్రలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్కు రెండు ఉత్పాదక కేంద్రాలుండగా, హుధుద్ ప్రభావం వీటిపై పడింది. ప్రస్తుతం జరిగిన నష్టం నేపథ్యంలో బీమా క్లయిమ్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు సౌమెన్ చక్రబర్తి చెప్పారు.
పెరిగిన టెక్మహింద్ర నికర లాభం
ముంబై: దేశీయ ఐటి రంగ సంస్థ టెక్మహింద్ర నికర లాభం ఈ జూలై-సెప్టెంబర్లో గతంతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. ఈసారి 719.7 కోట్ల రూపాయలుగా నమోదైతే, పోయినసారి 718.4 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు బుధవారం సంస్థ తెలియజేసింది. ఆదాయం మాత్రం 15 శాతం ఎగబాకి 5,488 కోట్ల రూపాయలుగా నమోదైంది.
16శాతం పెరిగిన ఇమామీ నికర లాభం
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సిజి రంగ సంస్థ ఇమామీ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో క్రిందటిసారితో చూస్తే 16 శాతం పెరిగింది. ఈసారి 92.76 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 79.96 కోట్ల రూపాయలుగా ఉంది. నికర అమ్మకాలు ఈసారి 489.60 కోట్ల రూపాయలుగా ఉంటే, నిరుడు 406.74 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు బుధవారం పేర్కొంది.