ఎస్బీహెచ్ @Q2: లాభం రూ. 311 కోట్లు
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బిహెచ్) సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం ఏకంగా 91 శాతం వృద్ధి చెంది 311 కోట్ల రూపాయలుగా నమోదైందని ఎస్బిహెచ్ మేనేజింగ్ డైరెక్టర్ శంతను ముఖర్జీ వెల్లడించారు.
బ్యాంక్ స్ధూల నిరర్ధక ఆస్తులు జూన్ నాటికి రూ. 6,174 కోట్లు ఉండగా.. సెప్టెంబర్ చివరి నాటికి రూ. 5,654 కోట్లకు పరిమితమయ్యాయి. స్ధూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 6.26 శాతం నుంచి 5.73 శాతానికి, నికర నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 3.37 శాతం నుంచి 2.87 శాతానికి తగ్గాయి.
గత ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ. 945 కోట్లు ఉండగా.. 2014-15 ఇదే కాలంలో రూ. 1,094 కోట్లకు చేరింది. వ్యక్తిగత రుణాలు 15 శాతం, గృహ రుణాలు ఫోర్టుఫోలియో 21 శాతం చొప్పున వృద్ది చెందాయి.
2014 సెప్టెంబర్ చివరి నాటికి బ్యాంకు వ్యాపారం రూ. 2,19,307 కోట్లకు చేరింది. ఇందులో డిపాజిట్లు రూ. 1,20,664 కోట్లు కాగా.. బ్యాంకు ఇచ్చిన రుణాలు రూ. 98,643 కోట్లు. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే రుణ, డిపాజిట్ల నిష్పత్తి 80.10 శాతం నుంచి 83.19 శాతానికి చేరింది.
కార్పొరేట్ రంగంలో స్తబ్దత నెలకొనడంతో రిటైల్, ఎస్ఎంఇ రంగాలపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించినట్లు శంతను ముఖర్జీ వెల్లడించారు. ఇందులో భాగంగానే రిటైల్, ఎస్ఎంఇ రంగాల కోసం ప్రత్యేకమైన పథకాలను తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.
ఖాతాలకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న కస్టమర్ల కోసం బ్యాంక్ ఎస్ఎంఎస్ సర్వీసులను ప్రారంభించింది. ఖాతాలతోపాటు ఏటీఎం, నగదు విత్డ్రాకు సంబంధించిన సమస్యలపై 9000222444 నంబర్కు హెల్ప్ అని మేసేజ్ పంపాల్సి ఉంటుంది. కార్పొరేట్ ఆఫీస్ నుంచి 48 గంటలలోపు బ్యాంక్ అధికారి ఫోన్ చేసి సమస్య వివరాలను తెలుసుకోని, పరిష్కరించనున్నట్లు బ్యాంక్ ఎండీ తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 100 శాఖలను ప్రారంభించనున్నట్లు ముఖర్జీ పేర్కొన్నారు. గడిచిన ఆరు నెలల్లో కొత్తగా 57 శాఖలను ఏర్పాటు చేయడంతో మొత్తం సంఖ్య 1,751కి చేరాయి. వచ్చే జనవరి నాటికి 900 మంది ఆఫీసర్ స్థాయి సిబ్బందిని నియమించుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు.