తెల్లపూర్ టెక్నోసిటీ.. మళ్లీ, మాటిచ్చిన కేటీఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: కొత్త ప్రభుత్వం హైదరాబాదులో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో పలు అంతర్జాతీయ కంపెనీలు ఆకర్షణీయమైన ప్రాజెక్టులతో ముందుకు వస్తున్నాయి. ప్రపంచంలోనే ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీ అయిన టిష్మ్యాన్ స్పియర్ గతంలో ప్రకటించిన తెల్లాపూర్ టెక్నోసిటీ ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది.
మంగళవారం నాడు సచివాలయంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో చర్చలు జరిపిన టిష్మ్యాన్ స్పియర్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ యం స్పైస్ తెల్లాపూర్ టెక్నోసిటీని పునరుద్ధరిస్తున్నట్లు ఐటీ మంత్రి కేటీఆర్తో తెలిపారు.
కంపెనీ ప్రతినిధులతో కలిసి తాము చేపట్టబోయే ప్రాజెక్టు వివరాలను మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషీ పాల్గొన్నారు.
వంద ఎకరాల్లో టిష్మ్యాన్ స్పియర్ కంపెనీ చేపట్టబోతున్న తెల్లాపూర్ టెక్నోసిటీ ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కంపెనీ ప్రతినిధులకి హామీ ఇచ్చారు. దీని పైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నాక పూర్తి వివరాలు ప్రకటిస్తామన్నారు.