పారిశ్రామికవేత్తలకు కెసిఆర్ హామీ (పిక్చర్స్)
హైదరాబాద్: కొత్త పరిశ్రమలకు అనుమతులు జారీ చేయడంలో అవినీతి రహిత పద్దతి (జీరో కర ప్షన్)ని ప్రవేశ పెడుతున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రకటించారు. దాంతో పాటు అధికారుల అనవసర ప్రమేయాన్ని తగ్గించేందుకు వీలైన విధానాన్ని అమలుపరుస్తామని చెప్పారు. సింగిల్ విండో పద్దతిలో పరిశ్రమలకు అనుమతులను జారీ చేసే విధానంపై ముఖ్యమంత్రి సోమవారం పారిశ్రమికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.
ఈ సమావేశంలో భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), తెలంగాణ పారిశ్రామిక సంఘం, ఫ్యాప్సీ ప్రతినిధులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ప్రభుత్వ సలహదారుడు పాపారావు, జెన్కో సిఎండి ప్రభాకర్, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కె జోషి పాల్గొన్నారు.
రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం కొత్త పాలసీని అమలు పరచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. సింగిల్ విండో పద్దతిలో అనుమతులను జారీ చేయాలని నిర్ణయించారు. పరిశ్రమల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అనుమతులను జారీ చేసే విధంగా కొత్త విధానాన్ని ప్రవేళపెట్టనున్నారు. అందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్ను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే సోమవారం పరిశ్రమల సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సూచలు చేయవచ్చు..
తాము రూపొందిస్తున్న కొత్త పారిశ్రామిక విధానంలో ఇంకేమైన మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటే అందుకు సంబంధించిన సూచనలను చేయవచ్చని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
తిరగాల్సిన అవసరం లేదు...
అధికారుల చుట్టూ పారిశ్రామిక వేత్తలు పదే పదే తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త పద్దతిని ప్రవేశపెడుతున్నట్టు కెసిఆర్ ప్రకటించారు.
త్వరలోనే ప్రకటన
ఈ విధానానికి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ పారిశ్రామిక ప్రతినిధులకు స్పష్టం చేశారు.
విధానానికి కితాబు
ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా ఉందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రతిపాదిత పారిశ్రామిక విధానం రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని వారన్నారు. అవసరమైతే కొన్ని మార్పులు చేర్పులను తాము సూచిస్తామని వారు తెలిపారు.