టాప్ 3లో పెప్సికో సీఈఓ ఇంద్రనూయి
న్యూఢిల్లీ: ఫార్చ్యూన్ సంస్ద ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల చేసింది. ఈ జాజితాలో పెప్సికో సీఈఓ ఇంద్రనూయి ముడో స్దానంలో నిలిచారు. వివరాల్లోకి వెళితే మోస్ట్ పవర్ పుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ - 2014 పేరుతో జాబితాను ప్రకటించింది.
ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు ఇంద్రనూయి కావడం విశేషం. మొదటి స్దానంలో ఐబీఎమ్ ఛైర్మన్, సీఈఓ రోమెటీ దక్కించుకోగా... రెండో స్దానంలో జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బరా ఉన్నారు. గత ఏడాది ప్రకటించిన ఇదే జాబితాలో ఇంద్రనూయి రెండో స్దానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
ఇంద్రనూయి తమిళనాడుకు చెందిన వారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫార్చ్యూన్ సంస్ద విడుదల చేసిన జాబితాలో ఇంద్రనూయి టాప్ - 10 స్దానంలో చోటు దక్కించుకుంటున్నారు. 2006, 2007, 2008, 2009, 2010 ఇలా వరుసగా ఐదు సంవత్సరాల పాటు మోస్ట్ పవర్ పుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ జాబితాలో అగ్రస్దానంలో నిలవడంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది రెండవ స్దానంలో నిలిచిన జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బరా గత ఏడాది 29వ స్దానంలో నిలిచారు.