రికార్డులతో పరుగుపెడుతున్న మార్కెట్లు
ముంబై: భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటనలో పెట్టుబడులను స్వాగతించిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పరుగుపెడుతున్నాయి. బుధవారం ఉదయం కూడా స్టాక్ మార్కెట్ల పరుగు కొనసాగింది. కరెంట్ ఖాతా లోటు గణనీయంగా తగ్గడంతో పాటుగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆశించినదానికన్నా మెరుగైన వృద్ధి రేటు నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు వరదలాగా వచ్చిపడుతుండడంతో బిఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం మరో 151 పాయింట్లు పెరిగి తొలిసారిగా 27 వేల పాయింట్ల స్థాయిని దాటిపోయింది.
మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ నిఫ్టీ సైతం తొలిసారి 8.100 పాయింట్ల స్థాయిని తాకింది. వరసగా ఎనిమిదో రోజు లాభాల బాటలో సాగిన సెన్సెక్స్ తాజాగా చరిత్రలోనే మొట్టమొదటిసారి లావాదేవీల ప్రారంభంలో 27,082.85 పాయింట్ల రికార్డు స్థాయిని తాకింది. అయితే చివరికి క్రితం ముగింపుకన్నా 151.84 పాయింట్లు పెరిగి 27,019.39 పాయింట్ల వద్ద ముగిసింది.
గత జూలై 7న 26 వేల పాయింట్లకు చేరిన సెన్సెక్స్ మంగళవారం 27 వేల పాయింట్లను దాటడానికి కేవలం 40 ట్రేడింగ్ సెషన్లు పట్టింది. మరో వైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం లావాదేవీల మధ్యలో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 8,100 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే పై స్థాయిలో లాభాల స్వీకరణతో ఆ లాభాలు కొంతమేరకు తగ్గి చివరికి 55.35 పాయింట్ల పెరుగుదలతో 8,083 పాయింట్ల వద్ద స్థిరపడింది.
సానుకూల ఆర్థిక గణాంకాల మద్దతుతో విదేశీ పెట్టుబడులు కొనసాగుతూ ఉండడం మార్కెట్ సెంటిమెంట్కు మరింత ఊతమిచ్చిందని బ్రోకర్లు అంటున్నారు. కరెంట్ ఖాతా లోటు గణనీయంగా తగ్గి 1.7 శాతానికి చేరుకోవడం, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జిడిపి వృద్ధి రెండున్నర సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 5.7 శాతానికి చేరుకోవడం మార్కెట్లో సానుకూల పరిస్థితులకు దోహదమిచ్చింది.