ఎగవేతదారే: విజయ్ మాల్యాపై యుబిఐ
న్యూఢిల్లీ: కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, దాని ప్రమోటర్ విజయ్మాల్యా, మరో ముగ్గురు డైరెక్టర్లను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించింది యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు బాకీలిచ్చిన బ్యాం కుల్లో విజయ్మాల్యాను విల్ఫుల్ డిఫాల్టర్(ఎగవేతదారు)గా ప్రకటించిన తొలి బ్యాంకు ఇదే కావడం గమనార్హం. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియంలో ఉన్న యునైటెడ్ బ్యాంకుకు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ దాదాపు 350 కోట్ల రూపాయలు బకాయి పడింది.
కన్సార్టియంలో కాకుండా విడిగా మరో 60 కోట్ల రూపాయలను ప్రీ-డెలివరీ పేమెంట్గా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు యునైటెడ్ బ్యాంక్ అందించింది. ‘విజయ్ మాల్యాతోపాటు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బోర్డులోని మగ్గురు డైరెక్టర్లను ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (విల్ఫుల్ డిఫాల్టర్లు)గా మేము ప్రకటిస్తున్నాం.' అని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపక్ నారంగ్ పిటిఐకి తెలిపారు. విజయ్ మాల్యా, కింగ్ఫిషర్ డైరెక్టర్లైన రవి నెడుంగడి, అనిల్ కుమార్ గంగూలీ, సుభాష్ గుప్టేలను విల్ఫుల్ డిఫాల్టర్లుగా యునైటెడ్ బ్యాంక్ సమస్యల పరిష్కార కమిటీ (జిఆర్సి) ప్రకటించింది.
ఈ ప్రకటనతో వీరుగానీ, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్గానీ భవిష్యత్తులో ఇక ఎప్పుడూ కూడా బ్యాంకు నుంచి రుణం పొందే అవకాశాన్నీ కోల్పోయినట్లైంది. అంతేగాక సంస్థల్లో డైరెక్టర్ స్థాయి హోదాలకూ అనర్హులైనట్లైంది. వీరిపై క్రిమినల్ చర్యలకు దిగే అవకాశాలూ కనిపిస్తున్నాయి. కాగా, తమ ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతోపాటు, ఆర్బిఐ, సెబీకి తెలియపరిచామని బ్యాంక్ ఈడి నారంగ్ స్పష్టం చేశారు.
గత వారం కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ మాల్యాతోపాటు డైరెక్టర్లను విల్ఫుల్ డిఫాల్టర్లుగా ప్రకటించడానికి అనుమతినివ్వగా, సోమవారం బ్యాంక్ జిఆర్సి సమావేశమై నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ నిర్ణయానికి ముందు జిఆర్సి సమావేశానికి హాజరు కావాలని మాల్యాకు డైరెక్టర్లకు బ్యాంక్ స్పష్టం చేసినా వారు పట్టించుకోలేదు. అంతేగాక దీనిపై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశామని, తీర్పు పెండింగ్లో ఉన్నందున విల్ఫుల్ డిఫాల్టర్లుగా నిర్ణయించరాదని తమతమ లాయర్ల ద్వారా జిఆర్సికి వారు లేఖలు పంపించారు.