‘మేక్ ఇన్ ఇండియా’: 20వేల కోట్ల కొనుగోళ్లు!
న్యూఢిల్లీ: రక్షణ రంగం పటిష్టతపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రాధాన్యతను కొనసాగిస్తున్నారు. విదేశీ సంస్థల నుంచి తేలికరకం హెలికాప్టర్లు కొనకూడదని, వాటిని భారతదేశంలోనే తయారు చేయించుకోవాలని నిర్ణయించారు. హెలికాప్టర్ల కొనుగోలుకు ఇంతకుముందు పిలిచిన గ్లోబల్ టెండర్లను రద్దు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
కేవలం భారతీయ పరిశ్రమల నుంచి మాత్రమే టెండర్లు ఆహ్వానించబోతోంది. దీంతో ‘మేక్ ఇన్ ఇండియా' అంటూ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాన నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు భారతీయ రక్షణ రంగ పరిశ్రమలు స్పందించాల్సిన సమయం వచ్చింది.
ఈ కొనుగోళ్ల విలువ దాదాపు 20వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆర్మీతోపాటు వైమానిక దళం కూడా చీతా, చేతక్ హెలికాప్టర్లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. వీటిలో దాదాపు 197 హెలికాప్టర్లకు కాలపరిమితి తీరిపోవడంతో వాటన్నింటినీ మార్చాల్సిన అవసరం ఏర్పడింది.
కాగా, టాటా, రిలయన్స్, మహీంద్రా పారిశ్రామిక సంస్థలు సైనిక అవసరాలకు కావాల్సిన సామాగ్రిని ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చాయి. టాటా గ్రూప్ సంస్థలకు దేశంలో హెలికాప్టర్ల ఉత్పత్తికి కేంద్ర హోంమంత్రి శాఖ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. గత కొంతకాలంగా ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం ఒకటిగా నిలుస్తున్న విషయం తెలిసిందే.
రక్షణరంగ కొనుగోళ్ల విలువ జిడిపిలో దాదాపు 2శాతం వరకు ఉంటోంది. ఇప్పుడు వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం మానేసి స్వదేశీ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తే ఇక్కడ రక్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధి మరింత మెరుగయ్యే అవకాశం కూడా ఉంటుంది.