ఇక అక్రమార్కుల భరతం పడతాం: సెబి
న్యూఢిల్లీ: కొత్తగా లభించిన అధికారాలతో అక్రమంగా నిధులు సేకరించే పథకాలపైన, ఇతర నేరస్థులపైనా కొరడా ఝళిపించడానికి స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబి) సిద్ధమవుతోంది. అక్రమంగా నిధులు సేకరించే పథకాలపైన, ఇతర నేరస్థులపై చర్యలు తీసుకోవడానికి కొత్త అధికారాలు లభించడంతో అలాంటి వారిపై సత్వర చర్యలు తీసుకోవడానికి, అలాంటి పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారికి తిరిగి డబ్బులు చెల్లించడానికి కొత్త చట్టం వీలు కల్పిస్తున్నందున నేరస్థులు ఇకపై తమ ఆదేశాలను బేఖాతరు చేయడానికి, ఏళ్ల తరబడి కేసులను సాగ దీయడానికి వీలుండదని సెబి పేర్కొంది.
ప్రత్యేక సెబి కోర్టును ఏర్పాటు చేయడంతో పాటుగా అదనంగా లభించిన ఈ అధికారాల వల్ల తప్పు చేసిన వారు ఇక ఎంతమాత్రం తప్పించుకోలేరని, అలాంటి వారిపై రికవరీ చర్యలు తీసుకోవడానికి, అవసరమైతే నేరస్థుల ఇళ్లు, కార్యాలయాలు సోదా చేయడానికి, ఆస్తులను జప్తు చేయడానికి కూడా సెబికి అధికారాలు లభించాయని సెబి చైర్మన్ యుకె సిన్హా తెలిపారు.
ఇంతకు ముందు నేరస్థులు సెబి ఆదేశాలను పట్టించుకోకుండా ఉండేవారని, అలాగే ఎలాంటి సొమ్ము రికవరీ లేకుండా కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి సాగుతుండేవని, అయితే ఇప్పుడు ఆ పరిస్థితిలో విప్లవాత్మక మార్పు రానుందని సిన్హా పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘కోర్టుల్లో కేసులు పది, పదిహేను సంవత్సరాలు సాగడమే కాకుండా ఒక్క పైసా కూడా రికవరీ అయ్యేది కాదు. అలాంటి అక్రమాలకు పాల్పడే వ్యక్తులు, కంపెనీల పేర్లను వెల్లడించి, వారిని అవమానానికి గురిచేయడం లాంటి కొద్దిపాటి ప్రయోజనం తప్ప వారిపై పెద్దగా ప్రభావం ఉండేది కాదు' అని ఆయన అన్నారు.
అయితే ఆగస్టు ప్రారంభంలో సెక్యూరిటీ చట్టాల సవరణ చట్టానికి పార్లమెంటు ఆమోదం లభించి, ప్రభుత్వం దాన్ని నోటిఫై చేసిన తర్వాత సెబికి అనుమతి లేకుండా వందకోట్లు, అంతకు పైగా నిధులు సేకరించే అన్ని అక్రమ పథకాలపైన చర్యలు తీసుకునే అధికారాలు లభించాయని సిన్హా చెప్పారు. అంతేకాకుండా దర్యాప్తు సమయంలో ఏ సంస్థనుంచైనా డేటా రికార్డులు, లేదా ఇతర సమాచారాన్ని పొందడానికి, త్వరలో ఏర్పాటు చేయబోయే సెబి ప్రత్యేక కోర్టునుంచి అనుమతి పొందిన తర్వాత సోదాలు నిర్వహించడానికి, సంస్థ కార్యకలాపాలను నిలిపివేయడానికి కూడా ఈ చట్టం సెబికి అధికారాలు కల్పించింది.