ఇప్పడు ఇండిగో వంతు: రూ. 1887కే టిక్కెట్..!
న్యూఢిల్లీ: విమానయాన సంస్దలు వరుసపెట్టి ఆఫర్స్ను ప్రకటిస్తున్నాయి. మంగళవారం నాడు ప్రభుత్వ రంగ విమానయాన సంస్ద ఎయిర్ ఇండియా రూ. 100కే టిక్కెట్ను బుక్ చేసుకునే ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు అదే వరుసలో ఇండిగో వచ్చి చేరింది. ఇప్పటి వరకూ ఎన్నడూ లేనంత తక్కువ ధరకు రూ. 1887కే (అన్ని పన్నులు కలుపుకోని) టిక్కెట్లు అందిస్తామని ప్రకటించింది.
దేశంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా సెప్టెంబర్ 25 నుండి జనవరి 15వ తేదీ వరకు వెళ్లడానికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది. టిక్కెట్ల బుకింగ్ గురువారం నుండి ప్రారంభమైంది. ఇలా వరుసపెట్టి విమానయాస సంస్దలు ఆఫర్స్ ప్రకటించడంతో ఇండిగో ప్రత్యర్ది స్పైస్ జెట్ తన ఆఫర్ను గురువారం వరకూ పొడిగించింది.
దేశంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా సెప్టెంబర్ 25 నుండి జనవరి 15వ తేదీ వరకు వెళ్లడానికి టికెట్ రూ. 1888 మాత్రమేనని స్పైస్ జెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరో చవక సంస్ద ఎయిర్ ఏషియా ఇండియా ఐతే రూ. 600 నుండి రూ. 1900 వరకూ మూడు రకాలుగా ధరలను నిర్ణయించింది.
ఇండియన్ ఎయిర్ లైన్స్లో 2007, ఆగస్టు 7న ఎయిర్ ఇండియా విలీనమైన సంగతి తెలిసిందే. ఆరోజు నుండి ఆగస్టు 27ని ఎయిర్ ఇండియా దినోత్సవందగా జరపుతున్నారు. 2007లో విలీనమైన.. ఎయిర్ ఇండియా దినోత్సవాన్ని తొలిసారిగా ఎయిర్ ఇండియా దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. ఈ సందర్బంగా జరిగే కార్యక్రమంలో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు ఇవ్వనున్నట్లు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. ఎయిర్ ఇండియా ఆఫర్లో భాగంగా రూ. 100కే విమాన టిక్కెట్లను ఆఫర్ చేస్తున్నారు.
ఈ పరిమిత కాల ఆఫర్ కేవలం ఈ ఆగస్టు 27 నుండి ఆగస్టు 31 వరకూ మాత్రమే బుక్ చేయాలని, ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 30 మధ్య జరిగే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ను వినియోగించుకోవాల్సిందిగా ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా సూచించింది. ఈ ఆఫర్ పోందాలంటే ఎయిర్ ఇండియా వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవాలి.