రుణ మాఫీ తగదు: రాజన్, మార్కెట్లకు బొగ్గు సెగ
ముంబై: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో అలాంటి ప్రతిపాదనలను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాలను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ కోరారు. ఆయా రాష్ట్రాలు చేస్తున్న ఇలాంటి హామీలను అమలు చేస్తే బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బ తింటుందని అన్నారు. ఈ మేరకు సోమవారం ఆర్బిఐ విడుదల చేసిన ఓ ప్రకటనలో రాజన్ పేర్కొన్నారు.
కాగా, 27వ రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సదస్సులో భాగంగా 15 రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, 27 రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శులతో, 9 కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక కార్యదర్శులతో రాజన్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ పై ప్రకటన చేశారు. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిరుడు సంభవించిన పైలిన్ తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు 1.3 ట్రిలియన్ల రుణాలను రద్దు చేయాలని కోరుతున్నాయి.
స్టాక్మార్కెట్లకు ‘బొగ్గు' సెగ
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం భారీ లాభాలను అందుకున్నప్పటికీ సుప్రీం కోర్టు బొగ్గు గనుల కేటాయింపులపై చేసిన వ్యాఖ్యలతో స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. అయితే సరికొత్త స్థాయిలను మాత్రం చేరుకోగలిగాయి. బిఎస్ఈ సూచీ సెన్సెక్స్ 17.47 పాయింట్లు పెరిగి 26,437.02 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ 6.90 పాయింట్లు అందుకుని 7,906.30 వద్ద ముగిసింది.
కానీ ఇంట్రా-డే ట్రేడింగ్లో సెన్సెక్స్ 26,630.74 వద్దకు, నిఫ్టీ సైతం 7,968.25 స్థాయిని తాకాయి. 1993 నుంచి 2010 వరకు గత ఎన్డిఎ, యుపిఎ పాలనలో జరిగిన బొగ్గు గనుల కేటాయింపులు చట్టవిరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొనడం మార్కెట్ సెంటిమెంట్ను ఒక్కసారిగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో లోహ, నిర్మాణ, విద్యుత్, బ్యాంకింగ్ రంగాల షేర్లు మదుపర్లను ఆకట్టుకోలేక 4.34 శాతం నుంచి 0.89 శాతం మేర నష్టపోయాయ.