యుఎస్ ఇమ్మిగ్రేషన్ బిల్లు: భారత ఐటికి భారీ నష్టం!
‘అమెరికా ఇమ్మిగ్రేషన్ బిల్లు ఎస్744' వల్ల అమెరికాలో భారతీయ వీసా హోల్డర్లపై పెను ప్రభావం పడుతుందని, ఔట్సోర్సింగ్ పనులు గణనీయంగా పడిపోతాయని ఐఎఎసి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా అమెరికా ఔట్సోర్సింగ్ ఆదాయంపైనే ఆధారపడ్డ భారతీయ ఐటి రంగం కుదేలయ్యే ప్రమాదముందని చెప్పింది. భారతీయ సంస్థలు, ప్రొఫెషనల్స్ అమెరికాలో పనిచేసేందుకు హెచ్1బి లేదా ఎల్1 వీసాలను అధికంగా వినియోగిస్తారు. ఇమ్మిగ్రేషన్ బిల్లుతో ఆ వీసాదారులకు కొత్త చిక్కులు వచ్చిపడనున్నాయి.
‘బిల్లు చట్టరూపం దాల్చితే భారతీయ జిడిపి విలువ ఏటా దాదాపు 30 బిలియన్ డాలర్లు తగ్గిపోతుంది. అన్నింటికంటే మించి దేశంలో ప్రత్యక్షంగా కోటి మంది ఐటి ప్రొఫెషనల్స్పై ఈ బిల్లు ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎంతోకాలం పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికాలో ఉన్న 5 లక్షల మంది భారతీయ ఐటి ప్రొఫెషనల్స్కూ ఇదే సమస్య తలెత్తుతుంది.' అని ఐఏఎసి(ఇయాక్) చైర్మన్ శలభ్ కుమార్ తెలిపారు. చాలామంది భారతీయ ఐటి నిపుణులు హెచ్1బి లేదా ఎల్1 వీసాలపైనే పనిచేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
హెచ్1బి వీసా అమెరికా కంపెనీల్లో విదేశీ ఉద్యోగులు పనిచేయడానికి జారీ చేస్తున్నదైతే, ఎల్1 వీసా ఇతర దేశాల కంపెనీల ఉద్యోగులు అమెరికాలో ఉన్న తమ మాతృ సంస్థలు, అనుబంధ సంస్థల్లో తాత్కాలికంగా పనిచేసేందుకు వీలుగా జారీ చేసేది. అయితే చట్టంగా అమల్లోకి వస్తే ఇమ్మిగ్రేషన్ బిల్లు అమెరికాలోని సంస్థల్లో పనిచేస్తున్న అక్కడి ఉద్యోగుల్లో హెచ్1, ఎల్1 వీసా హోల్డర్లు 15 శాతం కంటే మించకుండా నిరోధిస్తుంది. అంతేగాకుండా 2017 ఆర్థిక సంవత్సరం నాటికి అమెరికాలోని సంస్థల్లో పనిచేస్తున్న అమెరికన్ ఉద్యోగుల దామాషా ప్రకారం హెచ్1బి, ఎల్1 వీసా వర్కర్లు 50 శాతానికి పరిమితం చేస్తుంది.
బిల్లు ఆమోదం పొందితే 2016 అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుంది. కాగా, 20 మిలియన్ల హిస్పానిక్ అమెరికన్లకు ఉపశమనాన్ని కలిగించేందుకే దాదాపు 98 శాతం బిల్లు దృష్టిపెట్టింది. వారికి పౌరసత్వం కల్పించాలని డెమోక్రాట్లు పట్టుబడుతున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు అలాజరిగితే ఓటు బ్యాంకు పెరిగి సెనెట్లో కనీసం 10 సీట్లనైనా గెలుచుకోవచ్చని, తద్వారా సభలో పట్టు సాధించవచ్చనేదే డెమోక్రాట్ల ఆలోచన అని శలభ్ కుమార్ చెబుతున్నారు.
మొత్తానికి 2009లో బరాక్ ఒబామా ఇచ్చిన ‘బెంగళూరు వద్దు, బుఫలో (న్యూయార్క్లో జనాభాపరంగా రెండో అతిపెద్ద నగరం) ముద్దు' నినాదం, కొన్ని అమెరికా కార్పొరేట్ సంస్థల ఫిర్యాదుల మధ్య వస్తున్న ఇమ్మిగ్రేషన్ బిల్లు భారత ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీసేలా ఉందని శలభ్ కుమార్ తెలిపారు.
నవంబర్లో అమెరికా మిడ్-టర్మ్ ఎన్నికలుండటంతో ఈ బిల్లు సాధ్యమైనంత త్వరలో ఎప్పుడైనా ఆమోదం పొందే వీలుందన్న ఆందోళనను వ్యక్తం చేసిన ఆయన, ఒకవేళ డెమోక్రాట్లు, రిపబ్లికన్లు బిల్లుపై పరస్పర అంగీకారంతో ఏకాభిప్రాయానికి వస్తే బిల్లు ఆమోదించడానికి 3 రోజుల సమయం కూడా పట్టకపోవచ్చన్నారు. కాబట్టి ఈ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎంతో సమయం లేదని, ఎలాగైనా దీనికి వ్యతిరేకంగా గట్టిగా తమ గొంతును వినిపించాలన్నారు. లేనిపక్షంలో దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బేనని హెచ్చరించారు.