కెసిఆర్తో పిరమల్ ప్రతినిధుల భేటీ: 2వేల కోట్లతో..
హైదరాబాద్: మహారాష్ట్రకు చెందిన ఔషధ సంస్థ పిరమల్ గ్రూప్ ఛైర్మన్ అజయ్ పిరమల్ నేతృత్వంలో ప్రతినిధి బృంధం బుధవారం సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో భేటీ అయింది. తెలంగాణలో రూ. 2వేల కోట్లతో ఔషధ, గాజు పరిశ్రమలను స్థాపించేందుకు సుముఖంగా ఉన్నట్లు వారు కెసిఆర్తో చెప్పారు.
ఈ సందర్భంగా పారిశ్రామిక విధానంపై పలు దేశాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో పలు దఫాలుగా చర్చించి, పారిశ్రామిక రంగంలో విశేష అనుభవం ఉన్న వారిని సంప్రదిస్తున్నట్లు పిరమిల్ ప్రతినిధులతో కెసిఆర్ చెప్పారు. పారిశ్రామిక విధానం రూపొందించడంతోపాటు, దానిని కట్టుదిట్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పారిశ్రామిక అనుమతులకు సులువైన, సరళమైన, అవినీతిరహితమైన సింగిల్ విండో వ్యవస్థను నెలకొల్పుతామని తెలిపారు. దీని కోసం ప్రత్యేక చట్టం తేనున్నట్లు వెల్లడించారు. ఆన్లైన్లోనే దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించే విధంగా పారదర్శక పద్దతులు అవలంబిస్తామని చెప్పారు. అనుమతులు రెండు వారాల్లో ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలో పరిశ్రమలకు కేటాయించేందుకు ఇప్పటికే రెండు లక్షల ఎకరాలను గుర్తించినట్లు కెసిఆర్ చెప్పారు.
ఈ భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పనా సంస్థ (టిఎస్ఐఐసి)కి అప్పగిస్తామని.. భూమి, నీరు, విద్యుత్ సరఫరాతోపాటు ఇతర మౌలికసదుపాయాలు కల్పనతోపాటు సంబంధిత అనుమతులు కూడా టిఎస్ఐఐసీ పొందుతుందని తెలిపారు. విప్రోతోపాటు పలు సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నాయని తెలిపారు.
పిరమిల్ సంస్థ తెలంగాణలో యూనిట్ ఏర్పాటుకు ముందుకొస్తే కావాల్సిన భూమితోపాటు ఇతర సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కెసిఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ లోటు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తామని చెప్పారు. మూడేళ్ళ తర్వాత తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుందని వెల్లడించారు.
పారిశ్రామిక విధానంపై సమావేశం
తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం గురువారం తుది రూపు దిద్దుకునే అవకాశం ఉంది. సింగపూర్ పర్యటనకు వెళ్లేలోగానే నూతన పారిశ్రామిక విధానాన్ని ఖరారు చేయాలనే యోచనలో ఉన్న కెసిఆర్... గురువారం సచివాలయంలో దీనిపై సమావేశం నిర్వహించనున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. రెండు వారాల్లోనే అనుమతులు మంజూరు చేసేలా సింగిల్ విండో విధానాన్ని రూపొందించి... దీనికి చట్టబద్ధం చేయాలని కూడా ఇప్పటికే నిర్ణయించారు.