అమెరికా అండ: రెడ్డీస్కు భారీ లాభాలు
హైదరాబాద్: దేశీయ ఔషధరంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికంలో 52.49 శాతం ఎగబాకింది. ఏప్రిల్-జూన్ వ్యవధిలో 550.39 కోట్ల రూపాయల నికర లాభాలను పొందింది. నిరుడు ఇదే త్రైమాసికంలో ఆదా యం 2,845 కోట్లు, నికరలాభం 360.93 కోట్లుగా ఉం ది. అప్పటితో పోల్చితే ఆదాయంలో 24 శాతం, నికరలాభంలో 52 శాతం పెరుగుదల నమోదైందని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తి వెల్లడించారు.
ఉత్తర అమెరికాలో ఆదాయాలు, లాభాల అండతో ఇంత ప్రోత్సాహక ఫలితాలు సాధించగలిగామని ఆయన చెప్పారు. ఉత్తర అమెరికాలో జనరిక్ ఔషధాల విక్రయం ద్వారా తాము 1648 కోట్ల రూపాయలు ఆర్జించామని, గత ఏడాది ఇదే త్రైమాసికం కన్నా ఇది 51 శాతం అధికమని ఆయన తెలిపారు. యూరప్ మార్కెట్ ఇప్పటికీ నీరసంగానే ఉందని, అక్కడ అమ్మకాలు ఏడు శాతం తగ్గాయని సౌమెన్ చెప్పారు.రష్యా, సిఐఎస్ దేశాల మార్కెట్లో ఉద్రిక్తతలున్నప్పటికీ 8 శాతం వృద్ధిని సాధించగలిగినట్టు ఆయన తెలిపారు.
అమెరికన్ మార్కెట్లో తాము గత ఏడాది ప్రవేశపెట్టిన ఔషధాలన్నీ చక్కని మార్కెట్ వాటా సాధించి తమ వృద్ధికి దోహదపడ్డాయని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ చెప్పారు. మొదటి త్రైమాసికంలో అమెరికాలో తాము తొమ్మిది ఉత్పత్తులకు దరఖాస్తులు చేశామని, వాటిలో ఎనిమిది తొలి దరఖాస్తు (ఫస్ట్ టు ఫైల్) ప్రతిపత్తి సాధిస్తాయనుకుంటున్నామని తెలిపారు. అమెరికాలో ఈ ఏడాది ఆదాయాలు 100 కోట్ల డాలర్ల మార్క్ను దాటగలవని ఆశిస్తున్నామన్నారు. ఉత్తర అమెరికాలో వృద్ధి ముందు ముందు కూడా అత్యంత ప్రోత్సాహకంగా ఉండవచ్చని ముఖర్జీ తెలిపారు.
భారత మార్కెట్లో ఆరోగ్యకరమైన వృద్ధిని ఆశిస్తున్నామని, గత కొన్ని త్రైమాసికాలుగా ఇక్కడ మార్కెట్లో అమ్మకాలు పెంచుకోవడానికి తాము తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని ముఖర్జీ అన్నారు. భారత మార్కెట్లో జనరిక్ ఔషధాల విక్రయాల ద్వారా తాము 400 కోట్ల రూపాయల ఆదా యం ఆర్జించామని తెలిపారు. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఇది 15 శాతం ఎక్కువ అని ఆయన అన్నారు. వర్ధమాన మార్కెట్ల అమ్మకాలు 19 శాతం వృద్ధితో 710 కోట్ల రూపాయలకు చేరాయని వివరించారు.