యునినార్ గిన్నిస్ రికార్డ్: ఎయిర్టెల్ కస్టమర్ల మోత
న్యూఢిల్లీ: రిటైల్ ఔట్లెట్ల ప్రారంభోత్సవంలో ప్రైవేట్రంగ టెలికాం ఆపరేటర్ యునినార్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఒకేరోజు, ఒకే సమయానికి 362 రిటైల్ ఔట్లెట్లను తెరవడం ద్వారా ఈ రికార్డును సాధించామని సోమవారం యునినార్ తెలిపింది.
ఈ రకంగా ప్రపంచంలో ఎక్కడా, ఏ సంస్థ కూడా ప్రారంభించలేదని సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాజీవ్ సేథి ఓ ప్రకటనలో చెప్పారు. ఈ ఘనతలో తమ ఉద్యోగులు, కస్టమర్లందరికీ భాగస్వామ్యం ఉందని తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్ (పశ్చిమ), ఉత్తరప్రదేశ్ (తూర్పు), బీహార్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ సర్కిళ్లలో యునినార్ కార్యకాలపాలు సాగుతున్నాయని చెప్పారు.
30 కోట్లు దాటిన ఎయిర్టెల్ కస్టమర్లు
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీగా ఉన్న భారతీ ఎయిర్టెల్ మరో ఘనతను సాధించింది. కంపెనీకి చెందిన మొబైల్, ఫిక్స్డ్ లైన్, డిఎస్ఎల్, డిటిహెచ్ సేవలనందుకునే వినియోగదారుల సంఖ్య 30 కోట్లు దాటింది. 1995లో సర్వీసులు ప్రారంభించిన ఈ కంపెనీ 2009లో 10 కోట్ల మైలురాయిని, 2012లో 20 కోట్ల మైలురాయిని అధిగమించింది. కంపెనీ వినియోగదారుల సంఖ్య 20 నుంచి 30 కోట్లు చేరేందుకు కేవలం 2 సంవత్సరాలు పట్టిందని కంపెనీ వెల్లడించింది.
ఎయిర్టెల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నాలుగో అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా అవతరించినట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఆసియా, ఆఫ్రికాల్లో కలిపి కంపెనీ 20 దేశాల్లో సేవలనందిస్తోంది. ప్రస్తుత రికార్డు తమ కార్యకలాపాల బలాన్ని తెలియజేస్తుందని, భవిష్యత్లో మరిన్ని రికార్డులను సాధిస్తామని కంపెనీ సిఈఓ, ఎండి (భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ అన్నారు. దేశీయ వైర్లెస్ వినియోగదారుల మార్కెట్లో కంపెనీకి 22.88 శాతం వాటా ఉంది. కంపెనీకి 20.88 మొబైల్ వినియోగదారులు, 33 లక్షల మంది వైర్లైన్ వినియోగదారులున్నారు.