మ్యాపథాన్: గూగుల్పై సిబిఐ(పిఈ) కేసు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్పై సిబిఐ (ప్రాథమిక విచారణ)పిఈ కేసు నమోదు చేసింది. నిరుడు ‘మ్యాపథాన్ 2013' అనే కార్యక్రమాన్ని చేపట్టినందువల్ల ఈ కేసు నమోదు చేసింది. మ్యాపథాన్ 2013 కార్యక్రమం ద్వారా భారతదేశంలోని సున్నిత ప్రదేశాలు, రక్షణ స్థావరాలను మ్యాపింగ్ చేసి.. చట్టాన్ని ఉల్లంఘించారని, అటువంటి ప్రదేశాలను మ్యాపింగ్ చేయరాదని ఇప్పటికే చట్టపరంగా నిషేధం విధించామని ఆ పిఈలో సిబిఐ పేర్కొంది.
మన దేశానికి అధికారిక మ్యాపింగ్ సంస్థగా సర్వే ఆఫ్ ఇండియా ఉన్న సంగతి తెలిసిందే. భారతదేశ మ్యాప్లలో లేని ఎన్నో ప్రదేశాలను గూగుల్ మ్యాపింగ్ చేస్తోందంటూ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసిందని, దాని ఆధారంగానే సిబిఐ ప్రాధమిక విచారణ కేసును నమోదు చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.
వాస్తవానికి, 2013 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ‘మ్యాపథాన్ 2013' అనే మ్యాపింగ్ పోటీని గూగుల్ నిర్వహించింది. మీ ఇరుగు పొరుగు ప్రదేశాలు మరీ ముఖ్యంగా ఆస్పత్రులు, రెస్టారెంట్ల వంటి వాటి వివరాలను గుర్తించండి (మ్యాపింగ్) అంటూ భారతీయ పౌరులకు గూగుల్ ఈ పోటీని నిర్వహించింది. మీ నగరాల్లోని ముఖ్యమైన ప్రాంతాల వివరాలను కూడా గూగుల్కు అందించాలని కోరింది. అయితే, ఈ పోటీని నిర్వహించడానికి ముందు సర్వే ఆఫ్ ఇండియా అనుమతిని గూగుల్ తీసుకోలేదు. దీంతో, పౌరులు తమకు తెలిసిన ప్రదేశాలు అన్నిటినీ గూగుల్ మ్యాపింగ్లో గుర్తించేశారు.
ఆయా మ్యాపింగ్ల్లో ప్రజా జీవితంతో సంబంధం లేని ఎన్నో రక్షణ సంస్థల వివరాలను పేర్కొన్నట్లు సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. దీంతో, సదరు మ్యాపింగ్కు సంబంధించిన వివరాలు తమకు ఇవ్వాలంటూ సర్వే ఆఫ్ ఇం డియా గూగుల్ను కోరింది. అయితే, సంబంధిత అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, జాతీయ భద్రత, నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నామని, రహస్య స్థావరాల విషయం తమకేమీ తెలియదని, ప్రస్తుతం మీకు ఇవ్వడానికి కూడా మా దగ్గర ఏమీ లేదని గూగుల్ ఇండియా జవాబు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఉల్లంఘనలన్నిటినీ ప్రస్తావిస్తూ కేంద్ర హోం శాఖకు సర్వే ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేసింది. పరిమిత సర్వే, మ్యాపింగ్ చేసుకోవాలని మాత్రమే తమకు ఆదేశాలు ఉన్నాయని, దేశంలోని మరే ఇతర ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థ, వ్యక్తులు ఇటువంటి సర్వేలు, మ్యాపింగులను చేయరాదని ఆ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఢిల్లీ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు జరిపి కేసు విస్తృతి, తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సిబిఐకి అప్పగించారు.