సుస్థిర ప్రభుత్వానికే ఓటు: ప్రముఖుల మాట
ముంబై: ఎప్పుడూ తీరిక లేకుండా గడిపే పారిశ్రామిక దిగ్గజాలు ముంబైలో గురువారం జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్లో తమ విలువైన ఓటు హక్కును క్యూలైన్లలో నిల్చుని మరీ వినియోగించుకున్నారు. రిలయన్స్ అడాగ్ గ్రూప్ అధిపతి అనిల్ అంబానీ, గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్, టిసిఎస్ సిఈఓ, ఎండి ఎన్ చంద్రశేఖరన్లు ఉదయమే తమ నియోజక వర్గంలోని పోలింగ్ బూత్లకు చేరుకుని ఓటు వేశారు.
రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ కూడా తన భార్య నీతా అంబానీ, ఇద్దరు కుమారులతో కలిసి ఓటు హక్కు వినియోగించున్నారు. ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. భారతీయులందరినీ ఏకంగా ఉంచే వారికే తమ ఓటు చెప్పారు. ‘భారతీయులందరినీ ఏకంగా ఉంచే వారికే మా ఓటు. 120 కోట్ల మంది భారతీయుల్లో మేమూ భాగస్వాములమేనన్న భావన సంతోషం కలిగిస్తోంది. బలమైన భారత్ను నిర్మించడానికి మనందరినీ ఓటు సమానం చేస్తుంది' అని ఆయన అన్నారు.
రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ దక్షిణ ముంబైలోని పెద్దార్ రోడ్లో ఉన్న బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఓటేయడం ప్రతీ ఒక్కరి బాధ్యత, అందరూ ఓటేయ్యాలని కోరుతున్నానని తెలిపారు. మలబార్ హిల్ ఏరియాలో ఎస్బిఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుస్థిరమైన, పటిష్టమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని తెలిపారు. కొత్త ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. పారదర్శక, స్పష్టమైన నిర్ణయాలు చాలా అవసరమని ఆమె అన్నారు.
ఆర్థిక వృద్ధిని, పటిష్టవంతమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని, ఫలితంగా ప్రపంచ గౌరవాన్ని మరోసారి పొందుతామని ఓటు వేసిన తర్వాత లార్సన్ అండ్ టూబ్రో చైర్మన్ ఎఎం నాయక్ మీడియాతో అన్నారు. సుస్థిర, నిర్ణయాత్మకమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దేశ వృద్ధి రేటును మళ్లీ గాడిలో పెడుతుందని ఆశిస్తున్నామని తన ఓటు హక్కును వినియోగించుకున్న ఐసిఐసిఐ బ్యాంకు సిఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చార్ పేర్కొన్నారు.
‘ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది. ప్రపంచం ముందు సిగ్గుపడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో సుస్థిర ప్రభుత్వం రావాలి' అని హెచ్సిసి చైర్మన్ అజిత్ గులాబ్చంద్ అన్నారు. కాగా, ఓటేసేందుకు వచ్చిన హెచ్డిఎఫ్సి చైర్మన్ దీపక్ పరేఖ్ ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారు. దక్షిణ ముంబైలో ఆయన కొన్ని దశాబ్దాలుగా తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈసారి ఊహించని విధంగా ఆయన ఓటు వేయలేకపోయారు. హెచ్ డిఎఫ్ సి వైస్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిస్త్రీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.